బెంగళూరు: స్పిన్నర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాయంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 293 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 237 రన్స్కు పరిమితమైంది. మార్క్ చాప్మన్ (92), సీన్ సోలియా (54) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-‘ఎ’.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 56తో కలుపుకొని ఓవరాల్గా భారత్ 96 పరుగుల ముందంజలో కొనసాగుతున్నది. కెప్టెన్ ప్రియాంక్ (17), రుతురాజ్ గైక్వాడ్ (18) క్రీజులో ఉన్నారు.