టెస్టు మ్యాచ్ తొలిరోజు పూర్తి ఆధిపత్యం చెలాయించిన కోహ్లీ సేన.. అదే జోరు కొనసాగిస్తుందనుకున్న అభిమానులకు భారీ షాక్ తగిలింది. సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట వర్షార్పణమైంది. ఇక మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (123), నిలకడగా ఆడుతున్న రహానే (48) చెలరేగుతారని అంతా అనుకున్నారు.
అయితే ఎన్గిడీతోపాటు కగిసో రబాడ కూడా నిప్పులు చెరగడంతో భారత బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు చివరకు 122 పరుగులతో నిలిచిన రాహుల్ ఆ స్కోరుకు ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే చాలా రోజుల తర్వాత నిలకడగా ఆడుతున్నాడనుకున్న రహానే కూడా పెవిలియన్ చేరాడు. అశ్విన్ (4) నిలబడలేదు. ఆశలు పెట్టుకున్న రిషభ్ పంత్ (8) కూడా నిరాశపరిచాడు. శార్దూల్ ఠాకూర్ (4), మహమ్మద్ షమీ (8) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో భారత జట్టు 308/9తో కష్టాల్లో కూరుకుపోయింది.
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు తొలి సెషన్లోనే భారత్ ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. తొలిరోజు ఆటలో మూడు వికెట్లు తీసిన ఎన్గిడీ మరో రెండు వికెట్లు కూల్చగా.. రబాడ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇద్దరు పేసర్లూ విజృంభించడంతో భారత బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు.