IND vs SA | టీ20 వరల్డ్కప్లో వరుస విజయాలతో జోష్లో ఉన్న టీమిండియా దూకుడుకు బ్రేక్ పడింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సఫారీలు గెలుపొందారు. దీంతో భారత్ను వెనక్కి నెట్టి ఐదు పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మొదట్నుంచి షాక్లు తగిలాయి. ఐదు ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (12) దూకుడుగా మ్యాచ్ ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. బౌండరీ లైన్ వద్ద రబాడా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔటయి పెవిలియన్ చేరాడు. యంగ్ బ్యాటర్ దీపక్ హుడా (౦), హార్దిక్ పాండ్యా (2) దారుణంగా విఫలమయ్యారు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులు తెచ్చే బాధ్యతను సూర్యకుమార్ యాదవ్ తన భుజాల మీద వేసుకున్నాడు. ఒక్కడే 68 పరుగులు చేశాడు. అతనికి కాసేపు దినేశ్ కార్తిక్ అండగా నిలబడ్డాడు. దినేశ్ కార్తీక్ (6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అశ్విన్ (7) కూడా విఫలమయ్యాడు. సూర్యకుమార్ (68) ఔటయ్యాక వచ్చిన బౌలర్లు ఎవరూ సత్తా చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 133 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 4 వికెట్లు, పార్నెల్ 3, అన్రిచ్ నోర్ట్జే ఒక వికెట్ తీశాడు.
టీమిండియా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసేసరికి క్వింటెన్ డికాక్ (1), బవుమా (10), రుస్సో (10 ) ఔటయ్యారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మర్క్రమ్(52) , డేవిడ్ మిల్లర్ (51) భాగస్వామ్యంలో జట్టుకు 85 పరుగుల భారీ స్కోర్ను అందించాడు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. కానీ మర్క్రమ్ ఔట్ తర్వాత దక్షిణాఫ్రికా కాస్త తడబడింది. అయినప్పటికీ నిలకడగా ఆడుతూ 134 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది.