భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో సఫారీలు తడబడ్డారు. క్వింటన్ డీకాక్ (124), వాన్ డర్ డస్సెన్ (52) పోరాడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే జట్టు స్కోరు 228 పరుగుల వద్ద పెహ్లుక్వేయో (4)ను శ్రేయాస్ అయ్యర్ రనౌట్ చేశాడు.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (39)తో కలిసి డ్వెయిన్ ప్రిటోరియస్ (20) మంచి షాట్లు ఆడాడు. ఈ సయంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ప్రిటోరియస్.. సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సఫారీ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కేశవ్ మహరాజ్ (6) కూడా బుమ్రా బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో సరిగా కనెక్ట్ కాలేదు. బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ అందుకున్నాడు. దీంతో సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత సిసాండ మగాల క్రీజులోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్ను బౌండరీతో మొదలుపెట్టిన మిల్లర్.. ఆ తర్వాత మరో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాఫ్లో కోహ్లీ చేతికి చిక్కాడు.
కాసేపటికే కెప్టెన్ రాహుల్కు క్యాచ్ ఇచ్చిన మగాల అవుటయ్యాడు. దీంతో సఫారీ జట్టు 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మైదానంలో 250పైగా పరుగులు చేస్తే గట్టి పోటీనివ్వొచ్చు.
ఇప్పటి వరకూ ఇక్కడ విజయవంతమైన అత్యధిక లక్ష్యఛేదన 259 పరుగులే కావడం గమనార్హం. ఇలాంటి స్థితిలో సఫారీలు 287 పరుగులు చేయడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే మిడిలార్డర్ వైఫల్యాలతో బాధపడుతున్న భారత జట్టు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి.