వాండరర్స్ టెస్టులో భారత జట్టు కీలక వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి మంచి టచ్లో కనిపించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్.. అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సెన్ ఆఫ్సైడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది.
ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రబాడ.. వెంటనే ముందుకొచ్చి లో క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు అందుకున్న రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్లో మయాంక్ అగర్వాల్ (26), పుజారా (3), రహానే (0), విహారి (20) వరుసగా వికెట్లు పడినా.. మరో ఎండ్లో గోడలా నిలబడ్డాడు.
రాహుల్ వికెట్ పోవడంతో భారత జట్టు 120/5తో కష్టాల్లో పడింది. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. పంత్, అశ్విన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు భారీ స్కోరు చేస్తేనే భారత జట్టు గట్టెక్కుతుంది. ఎందుకంటే మిగతా వాళ్లంతా బౌలర్లే. భారత జట్టు వికెట్ల పతనం చూసిన అభిమానులు మిడిలార్డర్ వైఫల్యంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
పుజారా, రహానేల బదులు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా అంటూ మండిపడుతున్నారు. మరి వచ్చే మ్యాచ్లో అయినా వాళ్లకు అవకాశం దక్కుతుందేమో చూడాలి.