యువఆటగాళ్లను కాదని సీనియర్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానేకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ వీరు మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. కేప్టౌన్లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఫర్వాలేదనిపించిన పుజారా.. రెండో ఇన్నింగ్సులో చతికిలపడ్డాడు.
రెండో ఆటముగిసే సమయానికి 57/2తో నిలిచిన భారత జట్టు.. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే పుజారా (9) వికెట్ కోల్పోయింది. మూడోరోజు తొలి ఓవర్ రెండో బంతికే పుజారా అవుటయ్యాడు. జాన్సెన్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి పుజారా ప్రయత్నించాడు.
కానీ బంతి ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో బ్యాట్కు తగిలిన బంతి లెగ్ స్లిప్ వైపు వెళ్లింది. కుడివైపు వెళ్తున్న బంతిని డైవ్ చేసి మరీ పీటర్సన్ అందుకున్నాడు. దీంతో మూడో రోజు వేసిన రెండో బంతికే పుజారా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే మరో వెటరన్ అజింక్య రహానే (1) కూడా అవుటయ్యాడు.
రబాడ వేసిన బంతి రహానే గ్లౌవ్ను తాకి వెనక్కు వెళ్లింది. దాన్ని అందుకోవడానికి కీపర్ వెరీనే ప్రయత్నించాడు. కానీ అతని చేతుల్లోంచి బంతి జారిపోయింది. అయితే అప్రమత్తంగా ఉన్న కెప్టెన్ ఎల్గార్ వెంటనే దాన్ని అందుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో సౌతాఫ్రికా రివ్యూ కోరింది.
ఫలితం వారికి అనుకూలంగా వచ్చింది. దీంతో భారత జట్టు 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఇన్నింగ్సులో కూడా బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ కోహ్లీ మీదనే పడింది.