టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీకి గడ్డుకాలం సాగుతోంది. మంచి టచ్లో ఉన్నట్లే కనిపించినా.. భారీ స్కోర్లు చేయడంలో ఇటీవలి కాలంలో విఫలమవుతున్నాడీ స్టార్ బ్యాటర్. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లంచ్ ముందు వరకూ 18 పరుగులు చేసిన కోహ్లీ.. పూర్తి నియంత్రణలో కనిపించాడు.
అయితే లంచ్ బ్రేక్ తర్వాత క్రీజులోకి వచ్చీరాగానే తొలి బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ సెంచరీ లేకుండానే 2021 ఏడాదిని పూర్తి చేసినట్లయింది. అంతేకాదు సెంచరీ లేకుండా కోహ్లీ ఆడిన 60వ ఇన్నింగ్స్ ఇది. 2019 వరకూ అద్భుత ఫామ్లో ఉన్న కోహ్లీ.. గత రెండేళ్లుగా భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు తిప్పలు పడుతున్నాడు. 2020లో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ ఏడాది ఆ పరిస్థితి మారుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన అతను.. వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. బంతి స్వింగ్ అవుతుందని కోహ్లీ అనుకున్నాడు. కానీ యాంగిల్లో వెళ్లిన బంతి కోహ్లీ బ్యాటును ముద్దాడి కీపర్ డీకాక్ చేతుల్లో పడింది. దీంతో 79 పరుగులకే భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. కోహ్లీ నిష్క్రమించడంతో రహానే క్రీజులోకి వచ్చాడు.