తొలి టెస్టులో ఘనవిజయం సాధించి, సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలిచేందుకు బాటలు వేసుకున్న భారత్.. రెండో టెస్టులో చతికిలపడి ఓటమిపాలైంది. దీంతో కేప్టౌన్లో జరిగే మూడో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ విషయంలో రెండు జట్లూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయని అందరూ భావిస్తున్నారు.
అయితే భారత జట్టే ఎక్కువ ఒత్తిడిలో ఉంటుందని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడినంతకాలం ప్రెషర్ అనుభవించాల్సి ఉంటుందని నెహ్రా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ విషయంలో భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుందని తెలిపాడు.
దీనిపై వివరణ ఇస్తూ.. ‘‘1-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న భారత్పై.. కఠినమైన పరిస్థితుల్లో 240 పరుగులు ఛేజ్ చేసి సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయం కచ్చితంగా భారత్ను ఒత్తిడిలోకి నెడుతుంది’’ అని నెహ్రా తెలియజేశాడు.
అలాగే గాయం కారణంగా మూడో టెస్టు నుంచి దాదాపు తప్పుకున్న మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై కూడా నెహ్రా స్పందించాడు. తానైతే అనుభవానికి ఓటేసి ఇషాంత్ను ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేశాడు.