కివీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 185 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన కివీస్కు కుదురుకునే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఫీల్డింగ్ విభాగంలో కూడా భారత ఆటగాళ్లు సత్తా చాటారు. వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో క్రీజులో కుదురుకున్న సేఫెర్ట్ను రనౌట్ చేశారు.
ఆ తర్వాతి ఓవర్లో హర్షల్ పటేల్ సత్తాచాటాడు. అతని బంతిని సిక్సర్ కొట్టడానికి జేమ్స్ నీషమ్ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి ఎడ్జ్ తీసుకొని బాగా ఎత్తుగా గాల్లోకి లేచింది. దాని వెనుక పరిగెత్తే క్రమంలో జారిపడబోయిన వికెట్ కీపర్ పంత్.. వెంటనే తేరుకొని ఆ క్యాచ్ అందుకున్నాడు.
ఆ వెంటనే కెప్టెన్ శాంట్నర్ను ఇషాన్ కిషన్ రనౌట్ చేశాడు. డీప్ మిడ్ వికెట్ నుంచి డైరెక్ట్ హిట్తో అతన్ని పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ జట్టు 84/7 స్కోరుతో కష్టాల్లో కూరుకుపోయింది.