Bazball | దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్ రూపురేఖలనే మార్చేస్తున్న తమ ఆటతీరుకు పెట్టుకున్న పేరు ‘బజ్బాల్’. 2022 లో జో రూట్ నుంచి బెన్ స్టోక్స్కు ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథ్య పగ్గాలు అప్పజెప్పినప్పట్నంచి ఇప్పటిదాకా ఆ జట్టు దూకుడు అంతా ఇంతా కాదు. అగ్రశ్రేణి ఆస్ట్రేలియాకు చుక్కలు చూపి.. పేస్తో విరుచుకుపడే సఫారీలను, నిలకడైన ఆటతో విజయాలు సాధించే న్యూజిలాండ్ను ఓడించి.. ప్లాట్ ఫిచ్లతో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగుపరుచుకునే పాకిస్తాన్నూ చిత్తుచేసిన స్టోక్స్ సేన సంచలనాలు సృష్టించింది. కానీ ఆ జట్టు హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ పాచికలు భారత్లో పారలేదు. పారకపోగా అవే ఆ జట్టు కొంపముంచాయని చెప్పినా అతిశయోక్తి లేదు. 2022 నుంచి 7 టెస్టు సిరీస్ల తర్వాత తొలిసారి ఒక సిరీస్ను ఓడిపోయింది. ప్రపంచాన్ని తమవైపునకు తిప్పుకున్నామని విర్రవీగుతున్న బజ్బాల్కు భారత్లో ఏమైంది..?
స్వదేశంలోనే గాక విదేశాల్లోనూ దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్.. భారత్లోనూ తమ ఆట మార్చుకోబోమని ఇక్కడికి వచ్చేప్పుడే ప్రకటించింది. పిచ్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా మా ఆట మాదే అని స్పష్టం చేసింది. భారత్లో బజ్బాల్ను ఇదే దెబ్బతీసింది. హైదరాబాద్ టెస్టులో అనూహ్య విజయం సాధించినా ఆ తర్వాత మాత్రం బోల్తా కొట్టింది. వైజాగ్లో భారత్ పుంజుకున్న అనంతరం కూడా ఇంగ్లండ్ తమ ఆటతీరుపై ఆత్మపరిశీలన చేసుకోలేకపోయింది. దూకుడే పరమావధిగా ఆడటం అన్ని సందర్భాలలోనూ కుదరదని, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని జెఫ్రీ బాయ్కాట్ వంటి ఇంగ్లండ్ మాజీలు ఆ జట్టును పదే పదే హెచ్చరించినా మెక్కల్లమ్ – స్టోక్స్ ద్వయం పట్టించుకోలేదు. వాగేవాళ్లు వాగనీ! అనుకున్నారు. రాజ్కోట్ టెస్టులోనూ వైజాగ్ ఫలితమే పునరావృతం అయినా ఆ జట్టు రాంచీకి సరైన ప్లాన్తో రాలేదు.
కీలక ఆటగాళ్ల ఫామ్ లేమి..
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ స్ట్రాంగ్ టీమ్తోనే బరిలోకి దిగుతోంది. జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, క్రాలే, డకెట్ వంటి బ్యాటర్లు, అండర్సన్, మార్క్ వుడ్, రాబిన్సన్ వంటి పేసర్లు ఉన్నా వాళ్లంతా విఫలమవుతున్నారు. నాలుగు టెస్టులు ముగిసిన ఈ సిరీస్లో ఇంగ్లండ్ తరఫున ముగ్గురు బ్యాటర్లే సెంచరీలు చేశారు. తొలి టెస్టులో ఓలీ పోప్, మూడో టెస్టులో బెన్ డకెట్, నాలుగో టెస్టులో జో రూట్లు మూడంకెల స్కోరు చేశారు. కానీ మిగిలిన మ్యాచ్లలో ఈ ముగ్గురూ దారుణంగా విఫలమయ్యారు. రాంచీ టెస్టు దాకా రూట్ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి తంటాలు పడ్డాడు. బెయిర్ స్టోదీ అదే పరిస్థితి. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అలా వచ్చి ఇలా వెళ్తున్నాడు. గుడ్డిలో మెల్లలా ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.
India breach the Bazball gate 💪 pic.twitter.com/L96Yik3Su7
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024
ఇక బౌలింగ్ విషయానికొస్తే ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ సేవలను కోల్పోయింది. రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, షోయబ్ బషీర్ వంటి డెబ్యూ స్పిన్నర్లతో ఇంగ్లండ్ టెస్టులు ఆడుతోంది. హర్ట్లీ హైదరాబాద్ టెస్టులో తప్పితే మిగిలిన మూడింటిలోనూ చూపిన ప్రభావం శూణ్యం. రిహాన్ అహ్మద్ వైజాగ్ టెస్టులో బెటర్ అనిపించాడు. రాంచీ టెస్టులో ఇంగ్లండ్ అతడిని పక్కనబెట్టి బషీర్ను రంగంలోకి దించింది. ఇంగ్లండ్ స్పిన్నర్లలో బషీర్ మాత్రమే రాణించాడు. జాక్ లీచ్ తొలి టెస్టు తర్వాత గాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. పేసర్లలో 185 టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. మార్క్ వుడ్ను ఇంగ్లండ్ ఆన్ అండ్ ఆఫ్ మాదిరిగా వాడుతోంది. ఈ సిరీస్లో వాళ్లిద్దరూ ఉన్నారంటే ఉన్నారంతే…
బజ్బాల్ కథ ముగిసినట్టేనా..?
ఇండియాతో సిరీస్ ఓడిపోగానే బజ్బాల్ కథ ముగిసినట్టేనా..? అన్న అభిప్రాయాలు వెలువడుతున్నా ఒక్క మ్యాచ్ లేదా సిరీస్ కోసమో తాము ఈ ఆట ఆడటం లేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే టెస్టులలో కూడా టీ20 ఆటతో ప్రేక్షకులకు క్రికెట్ మజాను అందించడమే తమ ధ్యేయమన్నది ఇంగ్లండ్ లక్ష్యమని అతడి వాదన. అదే మైండ్సెట్తో ఉన్న ఇంగ్లండ్.. ఇండియాతో ఓడినంత మాత్రాన బజ్బాల్ను వీడబోదు. ఈ సిరీస్ తర్వాత ఆ జట్టు జులైలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులు ఆడనుంది. అప్పటివరకూ ఆ జట్టు భారత సిరీస్ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని ఇంగ్లండ్ మాజీలు సూచిస్తున్నారు.