IND vs ENG 3rd Test | గతేడాది భారత జట్టులోకి వచ్చి సంచలన ఇన్నింగ్స్తో రికార్డుల దుమ్ము దులుపుతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. రాజ్కోట్ టెస్టులోనూ రఫ్ఫాడించాడు. 185 టెస్టులాడి సుమారు 700 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ వంటి దిగ్గజ బౌలర్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం అంటే మాములు విషయం కాదు. ఈ సిరీస్లో వరుసగా రెండో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్.. 236 బంతుల్లోనే 14 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 214 పరుగులు చేశాడు. భారత్ నుంచి వరుసగా రెండు టెస్టులలో డబుల్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు. ఈ రికార్డుతో పాటు రాజ్కోట్ టెస్టులో జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డుల జాతర సాగించాడు.
ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు..
ఈ మ్యాచ్లో జైస్వాల్ ఏకంగా 12 సిక్సర్లు బాదడంతో ఈ సిరీస్లో అతడు కొట్టిన సిక్సర్ల సంఖ్య 22కి చేరింది. తద్వారా ఒక సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా ఉన్న రోహిత్ శర్మ (2019లో దక్షిణాఫ్రికా సిరీస్లో) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత హర్భజన్ (14 సిక్సర్లు), నవజ్యోత్ సింగ్ సిద్ధు (11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో ఒక బౌలర్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టినవారిలో జైస్వాల్.. ధోని (2006), హార్ధిక్ పాండ్యా (2017) రోహిత్ శర్మ (2019), ఉమేశ్ యాదవ్ (2019) తర్వాత నిలిచాడు. జైస్వాల్ జోరుతో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇప్పటివరకూ నవజ్యోత్ సింగ్ సిద్దు (8), మయాంక్ అగర్వాల్ (8) పేరిట ఉంది. భారత్ నుంచే గాక ఓవరాల్ గా టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ (12) రికార్డును జైస్వాల్ సమం చేశాడు. ఈ జాబితాలో మాథ్యూ హెడెన్, నాథన్ ఆస్టిల్, బ్రెండన్ మెక్కల్లమ్, బెన్ స్టోక్స్, కుశాల్ మెండిస్లు ఉన్నారు.
దాదా రికార్డు ఖతం..
ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో జైస్వాల్.. భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. 2007లో దాదా.. పాకిస్తాన్పై స్వదేశంలో 534 పరుగులు చేశాడు. తాజాగా జైస్వాల్.. మూడు టెస్టులలోనే 545 పరుగులు సాధించాడు.
కాంబ్లీ, కోహ్లీల తర్వాత అతడే..
వరుసగా రెండు టెస్టులలో డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో జైస్వాల్ మూడోవాడు. అంతకుముందు ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ 1992-93లో ఇంగ్లండ్, జింబాబ్వేపై ద్విశతకాలు సాధించాడు. 2017-18లో విరాట్ కోహ్లీ.. శ్రీలంకపై వరుస టెస్టులలో డబుల్ హండ్రెడ్స్ బాదాడు. తాజాగా జైస్వాల్.. వైజాగ్, రాజ్కోట్ టెస్టులలో ఈ ఘనత సాధించాడు.