తొలి రోజు నుంచే అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. స్టార్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో ఇండోర్ టెస్టులో టీమ్ఇండియా రెండు సెషన్లు కూడా నిలువలేకపోయింది. ఆసీస్ యువ స్పిన్నర్ కునేమన్ ఐదు వికెట్లతో విజృంభించగా.. లియాన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్లో పట్టుదల కనబర్చిన కంగారూలు ఈ సిరీస్లో తొలిసారి ఆధిక్యంలో నిలిచారు. ఇప్పటికే భారత స్కోరును దాటేసిన ఆసీస్.. గురువారం మరెన్ని పరుగులు చేస్తుందో చూడాలి!
ఇండోర్: ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో మనవాళ్లే చిక్కుకోవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైంది. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. మనవాళ్లు కనీస పోరాటం కనబర్చకుండా పెవిలియన్కు వరుస కట్టారు. 22 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (12), శుభ్మన్ గిల్ (21), చతేశ్వర్ పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (3) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్ 5, లియాన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. బుధవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఫర్వాలేదనిపించారు. మన బౌలర్లలో జడేజా 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు కంటే ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈసారి ఎలాగైనా పోరాడాలని కంకణం కట్టుకొని బరిలోకి దిగినట్లు కనిపించిన కంగారూలు.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. గత రెండు టెస్టుల్లో పెద్దగా ప్రతిఘటించకుండానే వికెట్లు సమర్పించుకున్న ఆసీస్ ఈసారి గట్టి ప్రయత్నం చేసింది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండటంతో భారత కెప్టెన్ తొలి ఓవర్ నుంచే స్పిన్నర్లను బరిలోకి దింపాడు. అశ్విన్ బౌలింగ్ దాడిని ప్రారంభించగా.. రెండో ఓవర్లో ట్రావిస్ హెడ్ (9)ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో ఖవాజా, లబుషేన్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. గత మ్యాచ్లో దెబ్బకొట్టిన స్వీప్ షాట్ జోలికి పెద్దగా పోని ఆసీస్ ప్లేయర్లు.. చెత్త బంతులను శిక్షిస్తూ పరుగులు రాబట్టారు.
సిరీస్లో తొలిసారి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే రెండుసార్లు తృటిలో తప్పించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. లెఫ్టామ్ స్పిన్నర్ కునేమన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి బయటకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. కేఎల్ రాహుల్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఇక సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా.. లియాన్కు దొరికిపోయాడు. మొత్తం భారత ఇన్నింగ్స్లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఇదొక్కటే కాగా.. మిగిలినవాళ్లు ప్రయత్న లోపంతోనే వికెట్ ఇచ్చుకున్నారు. మరో ఎండ్లో వికెట్లు పడతున్నా.. కోహ్లీ క్రీజులో కుదురుకోవడంతో రన్మెషీన్ అదుకుంటాడనుకుంటే.. మార్ఫే బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. గత మ్యాచ్ల్లో చక్కటి పోరాటం కనబర్చిన లోయర్ ఆర్డర్ అదే జోరు కొనసాగించలేకపోవడంతో రెండో సెషన్లోనే రోహిత్ సేన ఆలౌటైంది.
అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు పడగొట్టడంతో పాటు 5 వేల పరుగులు చేసిన భారత రెండో ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా (503 వికెట్లు; 5527 పరుగులు) రికార్డుల్లోకెక్కాడు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (687 వికెట్లు, 9031 పరుగులు) తొలి స్థానంలో ఉన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ (కోహ్లీ 22, గిల్ 21; కునేమన్ 5/16, లియాన్ 3/35), ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 156/4 (ఖవాజా 60, లబుషేన్ 31; జడేజా 4/63).