ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ తండ్రిని జైలులోనే చంపేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కుట్ర పన్నినట్లు ఆయన కుమారులు సులేమాన్, ఖాసిమ్ ఖాన్ ఆరోపించారు. పాక్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు బ్రేక్ టైంలో ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియందాద్(Javed Miandad) ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తో కలిసి చాన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మియందాద్ ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. ఇమ్రాన్ చాలా గౌరవంగల వ్యక్తి అన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తి ఇమ్రాన్ కాదన్నారు. అలాంటి ఆలోచనలు ఇమ్రాన్కు లేవన్నారు. ఒకవేళ ఇమ్రాన్కు బయటకు రిలీజ్ చేస్తే ఏమవుతుందని, అతనేమైనా తినేస్తాడా లేక డ్యామేజ్ చేస్తాడా, ఆయన కూడా ఓ తండ్రి కుమారుడే కదా, అతను ఏం చేస్తున్నాడో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని మియందాద్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు 1992లో వన్డే వరల్డ్కప్ గెలిచిన విషయం తెలిసిందే.
జైల్లో చంపే కుట్ర
పాకిస్థాన్ దిగ్గజ సారథి, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు సులేమాన్, కాసిం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ కెప్టెన్ను జైల్లోనే చంపే కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ అథర్టన్తో వారు మాట్లాడుతూ.. ‘వాళ్లేం (ప్రభుత్వం) చేస్తున్నారో సుస్పష్టంగా కనిపిస్తున్నది. మా నాన్నను అక్కడే (జైల్లో) చంపేయాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు.
ఆయనను వీలైనంత ఎక్కువకాలం అక్కడే ఉంచి ఆయన నోరు మూయించాలనే ప్రణాళికతో ఉన్నారు. మా నాన్న మా అత్తలతో చివరిసారిగా మాట్లాడినప్పటికంటే ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. రోజుకు 23 గంటలకు పైగా ఒక గదిలో పూర్తి ఏకాంతంగా ఆయనను ఉంచుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక తటస్థ వైద్యుడితో నివేదిక ఇప్పించడానికి వాళ్లెందుకు భయపడుతున్నారు. కోర్టు ఆయనకు వైద్యసేవలపై ఆదేశించినప్పుడు మా తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశించాం. కానీ ప్రైవేట్ ఆస్పత్రికి బదులుగా ఆయనను ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి అక్కడ్నుంచి కొద్దిగంటల్లోనే నేరుగా జైలుకు తీసుకెళ్లడంతో మా భయాలు నిజమయ్యాయి ఇమ్రాన్ కుమారులు ఆందోళన వ్యక్తం చేశారు.