ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడిచేశారు. హర్జాస్ సింగ్ (55), కెప్టెన్ హ్యూగ్ వీబ్గన్ (48), హ్యారీ డిక్సాన్ (42)లతో పాటు ఆఖర్లో ఒలీవర్ పీక్ (43 బంతుల్లో 46 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాజ్ లింబాని మూడు వికెట్లు (3/38), నమన్ తివారి (2/63)లు రాణించారు.
బెనోని వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. పరుగులేమీ చేయకుండానే ఓపెనర్ సామ్ కొన్స్టాస్ ఔటయ్యాడు. అయితే రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్ డిక్సాన్తో కలిసి కెప్టెన్ వీబ్గన్ రెండో వికెట్కు 78 పరుగులు జోడించారు. ఈ ఇద్దర అర్థ శతకాలకు చేరువగా వచ్చినా భారత బౌలర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు. నమన్ తివారి వీబ్గన్తో పాటు డిక్సాన్ను కూడా ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయాక ఆసీస్ను భారత సంతతి ఆటగాడు హర్జాస్ సింగ్ ఆదుకున్నాడు. వికెట్ కీపర్ ర్యాన్ హిక్స్ (20)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగులు జోడించిన హర్జాస్.. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాజ్ లింబాని భారత్కు మరో బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన 35వ ఓవర్లో హిక్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హర్జాస్ను సౌమీ పాండే ఔట్ చేశాడు. లోయరార్డర్ బ్యాటర్లు మెక్మిలన్ (2), చార్లి అండర్సన్ (13)లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ ఒలీవర్ పీక్ మాత్రం.. ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టడంతో ఆసీస్ స్కోరు 250 పరుగుల మార్కును దాటింది. అండర్ – 19 ప్రపంచకప్లో భాగంగా 9వ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు.. ఆరోసారి ఈ ట్రోఫీని నెగ్గాలంటే భారత జట్టు 50 ఓవర్లలో 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.