దుబాయ్: వచ్చే ఏడాది ఆరుజట్లతో ఐసీసీ నిర్వహించనున్న అరంగేట్ర మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి మరో చోటుకు తరలించేందుకు ఐసీసీ సిద్ధమైంది. శ్రీలంక బోర్డు (ఎస్ఎల్సీ) వ్యవహారాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. 2023-24 కాలంలో ఆ దేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తోడు బోర్డులో అవినీతి, పరిపాలనా వ్యవహారాల్లో అవకతవకలతో ఐసీసీ.. కొన్నిరోజుల పాటు ఎస్ఎల్సీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
నాటి నుంచి ఎస్ఎల్సీకి పూర్తిస్థాయిలో పాలక మండలి లేకపోగా ప్రభుత్వం నియమించిన తాత్కాలిక ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ అధికారులతో వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని అనుమతించని ఐసీసీ.. బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని ఐసీసీ సూచించినా ఆ దేశ క్రీడాశాఖ దానిని పెడచెవిన పెట్టడంతో మహిళల చాంపియన్స్ ట్రోఫీ హక్కులను శ్రీలంక కోల్పోనున్నట్టు సమాచారం. ఇదే విషయమై ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ మాట్లాడుతూ.. ‘అవును, ఆ టోర్నీ శ్రీలంక నుంచి తరిలిపోయినట్టే. మరో వేదికలో ఆ టోర్నీ జరుగనుంది. కానీ అదెక్కడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము’ అని తెలిపాడు.