Stop Clock: ఆనతికాలంలోనే అత్యంత ప్రజాధరణతో పాటు క్రికెట్ బోర్డులకు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న పొట్టి క్రికెట్లో రేపట్నుంచి మరో కొత్త నిబంధన రాబోతోంది. ఈ ఫార్మాట్లో అనవసర సమయాన్ని అరికట్టి గేమ్ను మరింత జనరంజకంగా మార్చేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం (డిసెంబర్ 12) నుంచి ‘స్టాప్ క్లాక్’ను తీసుకురానుంది. దీని ప్రకారం.. ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఓవర్కు బౌలింగ్ టీమ్ కెప్టెన్ 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోరాదు. మంగళవారం నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య బార్బడోస్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు వేదిక కానుంది.
వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐసీసీ అహ్మదాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ స్టాప్ క్లాక్ నిబంధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం.. ఓవర్కు ఓవర్కు మధ్య అరవై సెకన్ల నిడివి మాత్రమే ఉండాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో రెండుసార్లు వార్నింగ్తో సరిపెట్టే అంపైర్లు.. మూడోసారి మాత్రం పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ టీమ్కు ఐదు పరుగులు జమచేస్తారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అనవసర సమయాన్ని అరికట్టేందుకే ఈ నిబంధన తీసుకొస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ICC to kick start Stop Clock Trial from ENG vs WI T20Is:
Stop clock will restrict the amount of time taken between overs, the bowling team need to be ready to bowl the first ball of their next over within 60 Sec of previous over – if teams fail to do so for the third time then 5… pic.twitter.com/twshTzUb7D
— Johns. (@CricCrazyJohns) December 11, 2023
డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ అంతర్జాతీయంగా నిర్వహించబోయే 59 మ్యాచ్లలో ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. ఏప్రిల్ తర్వాత ఈ నిబంధన అమలుతీరుపై సమీక్ష నిర్వహించి ఆ తర్వాత దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. స్లో ఓవర్ రేట్ను ఈ నిబంధన కట్టడి చేసేలా ఉన్నా కెప్టెన్లకు మాత్రం కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. ఓవర్ పూర్తికాకముందే తర్వాతి ఓవర్ ఎవరితో వేయించాలి..? అనే నిర్ణయం త్వరితగతిన తీసుకోవాల్సి ఉంటుంది.