కరీంనగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ వెంటే నడిచేందుకు కదలి వస్తున్నాయి. పార్టీయే తమకు శ్రీరామరక్ష అని కార్యకర్తలు స్పష్టంచేస్తున్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత పరిపాటి రవీందర్ ఆధ్వర్యంలో 120 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ను కలిశారు. తాము పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని స్పష్టంచేశారు. ఈటల గందరగోళానికి గురిచేసినా తాము మాత్రం టీఆర్ఎస్ వెంటే ఉంటామని, నియోజకవర్గంలో పార్టీని కాపాడకుంటూ బలోపేతం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.