Brij Bhushan Sharan Singh: పుష్కరకాలం పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా పనిచేసిన వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన జీవితంలో భాగమైన ‘రెజ్లింగ్’తో సంబంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఈ క్రీడా వ్యవహారాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, లోక్సభ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో తనకు ఇతర పనులు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెజ్లింగ్కు ‘రాం రాం’
నడ్డాతో సమావేశం అనంతరం బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ… ‘డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా నేను 12 ఏండ్లు పనిచేశాను. మంచో చెడో అనేది కాలమే నిర్ణయిస్తుంది. నేను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఈ ఆటతో నేను సంబంధాలు తెంచుకుంటున్నా. ఇకనుంచి డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన ప్యానెల్ చూసుకుంటుంది. లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. నేను ఆ బాధ్యతలు చూసుకోవాలి. ఈ క్రీడా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను…’ అని తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా 2011 నుంచి 2023 వరకూ పనిచేసిన బ్రిజ్ భూషణ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
ఎందుకీ నిర్ణయం…?
ఈనెల 21న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో బ్రిజ్భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ గెలుపొందడం కొత్త వివాదానికి దారితీసింది. ఏడాదికాలంగా తాము దేనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో మళ్లీ అదే జరుగబోతోందని భావనలో ఉన్న రెజ్లర్లు మరోసారి నిరసనల బాట పట్టారు. సంజయ్ సింగ్ ఎన్నికైన కొద్ది గంటల్లోనే దిగ్గజ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పునియా తన పద్మశ్రీ వాపస్ ఇచ్చేశాడు. బధిరుల ఒలిపింక్స్ స్వర్ణ విజేత విజేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ తిరిగిచ్చేస్తానని అన్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడటానికంటే ముందే కేంద్రం త్వరగా స్పందించింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ను సస్పెండ్ చేసింది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్.. అండర్ – 15, అండర్ – 20 జాతీయ రెజ్లింగ్ పోటీలను హడావిడిగా నిర్వహించేందుకు ప్రకటన జారీ చేయడాన్ని తప్పుబడుతున్నట్టు చెప్పినా రెజ్లర్ల నిరసన మరింత ఎక్కువవుతుందేమోనని భావించిన కేంద్రం.. సంజయ్తో పాటు బ్రిజ్ భూషణ్ను ఈ వ్యవహారం నుంచి తప్పించిందని తెలుస్తోంది.
ఇదిలాఉండగా సంజయ్ సింగ్ ప్యానెల్ను సస్పెండ్ చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. డబ్ల్యూఎఫ్ఐ పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్యానెల్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను కోరింది. డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాల నియంత్రణ, నిర్వహణ బాధ్యతలన్నీ ఐవోఏ చూసుకుంటుంది.