పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు సాధించడం సాధారణమైన విషయం కాదని ఆయన అన్నాడు. కోహ్లీని టీ20ల నుంచి ఎందుకు తప్పించకూడదని వ్యాఖ్యానించిన దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ విమర్శలను అతడు తిప్పికొట్టాడు.
రెండ్రోజుల క్రితం కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఫామ్ లేమిని చూపి అశ్విన్ ను టీ20ల నుంచి తప్పించినప్పుడు అదే విధంగా వరుసగా విఫలమవుతున్న కోహ్లీని పొట్టి ఫార్మాట్ నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించాడు.
కపిల్ వ్యాఖ్యలపై రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ‘కోహ్లీపై కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరించను. ఉన్నట్టుండి అందరూ విరాట్ మీద ఎందుకు పడ్డారు..? భారత క్రికెట్ కు అతడు ఎంతో సేవ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు సాధించడమనేది మామూలు విషయం కానేకాదు. నాకు తెలిసి కోహ్లీని టీ20ల నుంచి తప్పించేంత పని బోర్డు చేయదు..’ అని తెలిపాడు.
మూడేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయక ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-15తో పాటు వారం రోజుల క్రితం ఇంగ్లండ్ తో ముగిసిన ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా విఫలమయ్యాడు. శనివారం అదే ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఇక ఆదివారం జరుగబోయే మ్యాచ్ లో కోహ్లీ విఫలమైతే త్వరలో జరుగబోయే వెస్టిండీస్ సిరీస్ తో పాటు ఆసియా కప్ లో కూడా విరాట్ కు చోటు దక్కడం కష్టమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవే గనక నిజమైతే రాబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా కోహ్లీకి చోటు దక్కడం అనుమానమే అని అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.