దుబాయ్: ఐపీఎల్( IPL 2021 )లో భాగంగా ఢిల్లీ, కోల్కతా మ్యాచ్లో అశ్విన్, మోర్గాన్ మధ్య జరిగిన గొడవ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. కొందరు అశ్విన్ను, మరికొందరు మోర్గాన్ను వెనకేసుకొచ్చారు. అయితే ఈ గొడవపై గురువారం ట్విటర్లో అశ్విన్ స్పందించాడు. అతడో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. ఆ మ్యాచ్లో 19వ ఓవర్ చివరి బంతికి ఫీల్డర్ విసిరిన త్రో పంత్కు తగిలి వెళ్లడంతో అశ్విన్ రెండో పరుగు తీశాడు. దీనిపై కోల్కతా కెప్టెన్ మోర్గాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
దీనిపై ట్విటర్లో అశ్విన్ స్పందిస్తూ.. 1. నేను మరో పరుగు కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఫీల్డర్ బాల్ విసరడం చూశాను. అయితే అది పంత్కు తగిలిందన్నది నేను చూడలేదు. 2. ఒకవేళ నేను అది చూసినా పరుగెత్తేవాడినా? కచ్చితంగా, ఎందుకంటే అందుకు నాకు అనుమతి ఉంది. 3. మోర్గాన్ అన్నట్లు నేను క్రికెట్కే అవమానమా? కచ్చితంగా కాదు. 4. నేను కొట్లాడానా? లేదు, నాకోసం నేను నిలబడ్డాను. అదే నా టీచర్లు, తల్లిదండ్రులు నాకు నేర్పించారు. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. మోర్గాన్ లేదా సౌథీ క్రికెట్ ప్రపంచంలో వాళ్లకు ఏది తప్పు, ఏది ఒప్పు అని నమ్ముతారు అందుకు అనుగుణంగా ఉండొచ్చు. కానీ నైతిక విలువలు అంటూ అవతలి వాళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే హక్కు వాళ్లకు లేదు అని ఆ పోస్ట్లో అశ్విన్ తీవ్రంగా స్పందించాడు.
ఇది క్రికెట్ ఓ పెద్ద మనుషుల ఆట అనే అందరు అభిమానుల కోసం ఇది అంటూ చివర్లో అశ్విన్ ఓ సెటైర్ కూడా వేశాడు. ఈ వివాదంపై షేన్ వార్న్, వీరేంద్ర సెహ్వాగ్లాంటి మాజీలు కూడా స్పందించిన విషయం తెలిసిందే. మోర్గాన్ను సపోర్ట్ చేస్తూ వార్న్ ట్వీట్ చేయగా.. ఈ నైతిక విలువలు 2019 వరల్డ్కప్లో ఏమయ్యాయంటూ అదే మోర్గాన్కు చురకలంటించాడు సెహ్వాగ్.