మొహలీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ పాయింట్ల ఖాతా తెరిచింది. గ్రూపు-సిలో భాగంగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన హర్యానా 39.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్వర్మ(4/23), రవితేజ(3/23)ధాటికి హర్యానా బ్యాటర్లు ఘోరంగా తేలిపోయారు. యశు శర్మ(68) అర్ధసెంచరీ మినహా అందరూ విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 41 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(77 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో విజృంభించాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ హర్యానా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.