న్యూఢిల్లీ: తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. విజయవాడ వేదికగా వచ్చే నెల 4 నుంచి మొదలయ్యే మహిళల చాలెంజర్ ట్రోఫీకి త్రిష ఎంపికైంది. ఇటీవల జైపూర్లో జరిగిన అండర్-19 వన్డే చాలెంజర్ టోర్నీలో అత్యధిక పరుగుల(260)తో టాప్స్కోరర్గా నిలిచిన ఈ 16 ఏండ్ల యువ క్రికెటర్ ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం నాలుగు జట్లు బరిలోకి దిగుతున్న టోర్నీలో తానియా భాటియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న భారత్ ‘బి’ తరఫున త్రిష ప్రాతినిధ్యం వహిస్తున్నది. దూకుడైన బ్యాటింగ్కు తోడు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్తో ఆల్రౌండర్గా అదరగొడుతున్న త్రిష.. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా దూసుకెళుతున్నది. భారత ‘ఎ’ జట్టుకు స్నేహ్ రానా, ‘సి’టీమ్కు శిఖాపాండే, ‘డి’ జట్టుకు పూజ వస్ర్తాకర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ ‘ఎ’, ‘బి’ జట్లు తలపడుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లు స్మృతి మందన, షెఫాలీ వర్మ, హర్మన్ప్రీత్కౌర్, రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరమయ్యారు.
భారత్ ‘బి’: తానియా భాటియా (కెప్టెన్), త్రిష, అనూజ్ తోమర్, రియా చౌదరీ, పాలక్ పటేల్, శుభ సతీశ్, హర్లీన్ డియోల్, హుమైరా కాజీ, చందు వీ రామ్, రాశీ కనోజియా, సౌమ్య తివారీ, మేఘన సింగ్, సరళదేవి, సైమా ఠాకూర్, రమ్యశ్రీ