Sahaja Yamalapalli | దిగ్గజ క్రీడాకారిణి సానియా మీర్జా బాటలో మరో హైదరాబాదీ అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు సిద్ధమైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు.. చిన్న వయసు నుంచే రాకెట్తో రాణిస్తున్న యామలపల్లి సహజ ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఇప్పటికే రెండు ఐటీఎఫ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ.. ఈ ఏడాది హాంగ్జూ వేదికగా జరుగనున్న ఏషియన్ గేమ్స్లో పతకం నెగ్గడమే తన లక్ష్యమంటున్నది. తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సహజపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : చిన్నతనంలో స్నేహితులతో కలిసి సరదాగా రాకెట్ పట్టిన ఆ చిన్నారి.. పదేండ్లు వచ్చేసరికి టెన్నిస్నే కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువు.. శిక్షణ ప్రారంభించిన ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. మన హైదరాబాదీ యామలపల్లి సహజ. ఈ ఏడాది సెప్టెంబర్లో చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల కోసం అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా).. మంగళవారం 12 మందితో కూడిన భారత టెన్నిస్ జట్టును ఎంపిక చేసింది. ఇందులో ఆరుగురు పురుషులు కాగా.. ఆరుగురు మహిళలు. ఈ జట్టులో సహజ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం దేశం తరఫున డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న సహజ.. ఆసియా క్రీడల్లో సత్తాచాటడమే తన లక్ష్యమని అంటున్నది. అంకిత రైనా నేతృత్వంలో బరిలోకి దిగనున్న భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సహజ ఆశాభావం వ్యక్తంచేసింది.
హైదరాబాద్కు చెందిన 22 ఏండ్ల సహజ ఇప్పటి వరకు ప్రొఫెషనల్ కెరీర్లో రెండు ఐటీఎఫ్ టైటిల్స్ కైవసం చేసుకుంది. నిరుడు మార్చిలో ఐటీఎఫ్ నాగ్పూర్ టోర్నీ సింగిల్స్లో విజేతగా నిలిచిన సహజ.. జూలైలో గురుగ్రామ్ డబ్ల్యూ-25 టోర్నీ టైటిల్ ఖాతాలో వేసుకుంది. అప్పటి వరకు జూనియర్ స్థాయిలో సత్తాచాటినా.. నిలకడ కనబర్చలేకపోయిన ఈ హైదరాబాదీ.. సీనియర్ స్థాయిలో సత్తాచాటుతున్నది. నిరుడు 1290వ ర్యాంక్లో నిలిచిన సహజ.. ఐటీఎఫ్ టైటిల్స్ సాయంతో ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. ప్రస్తుతం 387వ స్థానంలో ఉన్న సహజ.. ఈ ఏడాది ముగిసేలోగా గ్రాండ్స్లామ్ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ర్యాంక్కు చేరుకోవాలని తహతహలాడుతున్నది.
పదేండ్ల వయసులో శిక్షణ ప్రారంభించిన సహజ.. ప్రస్తుతం బెంగళూరులోని పీబీఐ టెన్నిస్ అకాడమీలో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నది. కోచ్ సీజర్ మొరాల్స్ వద్ద శిక్షణ తీసుకుంటున్న సహజ.. తొలి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గడమే తన జీవితంలో పెద్ద మార్పు అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించిన ఈ హైదరాబాదీ.. దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతున్నది. యూనివర్సిటీ లెవల్ నుంచే విదేశీ టోర్నీల్లో పాల్గనడం ఎంతో కలిసొచ్చిందంటున్న సహజ.. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడే మనలోని సహజసిద్ధమైన ప్రతిభ బయటకు వస్తుందని చెప్పింది.
భారత జట్టుకు ఎంపికయ్యాననే మాట వినగానే ఆనందంతో ఎగిరి గంతేశా. ఆసియా క్రీడల వంటి పెద్ద టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దేశం తరఫున ఆడే ప్లేయర్లను చూసి ఎంతో గర్వించేదాన్ని. ఇప్పుడు అందులో నేను చేరడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టాప్-5 ప్లేయర్లను ఎంపిక చేస్తారని తెలుసు. దీంతో నాలుగో ర్యాంక్లో ఉన్న నాకు అవకాశం దక్కుతుందని ముందే ఊహించా. కానీ ఆ వార్త విన్న తర్వాత వచ్చిన సంతోషం వెల కట్టలేనిది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే చిన్న విషయం కాదు. మరింత బాధ్యత పెరిగినట్లు అనిపిస్తున్నది. నా వరకు 100 శాతం కష్టపడేందుకు ప్రయత్నిస్తా. దేశం తరఫున మువ్వన్నెల జెండా ఎగురుతున్న సమయంలో పతకం అందుకోవడం ప్రతి ఒక్కరి కల. ఇప్పటి వరకు రెండు టైటిల్స్ సాధించా ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో టాప్-200లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
-సహజ యామలపల్లి