న్యూఢిల్లీ : హైదరాబాద్ యువ క్రికెటర్ మదివాల మమత భారత మహిళల-ఏ జట్టులో చోటు దక్కించుకుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే నాలుగు రోజుల (మల్టీ-డే) మ్యాచ్ కోసం ప్రకటించిన జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్ మమత ఎంపికైంది. ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ పోరులో యాస్తిక భాటియా భారత కెప్టెన్గా వ్యవహరించనుంది.
ఈ పర్యటనలో ఆస్ట్రేలియా-ఏ జట్టు.. ఆతిథ్య అమ్మాయిలతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల్లో కూడా పోటీ పడనుంది. న్యూ చండీగఢ్లో సెప్టెంబర్ 12, 15,17వ తేదీల్లో జరిగే మూడు టీ20ల్లో పోటీపడే జట్టుకు అనుష్క శర్మ కెప్టెన్గా ఎంపికవగా.. మొహాలీలో (సెప్టెంబర్ 20, 23, 25) ఆతిథ్యం ఇచ్చే వన్డే సిరీస్లో పాల్గొనే జట్టును కూడా యాస్తిక నడిపించనుంది.