హైదరాబాద్: సిటీ ఆఫ్ పెరల్స్గా పేరు గాంచిన హైదరాబాద్ మరో క్రీడా లీగ్కు వేదిక కాబోతున్నది. ఇప్పటికే దేశంలో క్రీడా సౌకర్యాల విషయంలో ముందంజలో ఉన్న భాగ్యనగరం..ఆన్లైన్ గేమింగ్కు అడ్డాగా మారబోతున్నది. ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్(ఈఎస్పీఎల్) అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. దేశంలోని ఎనిమిది నగరాలు ఫ్రాంచైజీలుగా రాబోతున్న ఈఎస్పీఎల్లో తొలుత హైదరాబాద్ హైద్రాస్ టీమ్ పేరిట మన ముందుకు వస్తున్నది. హైదరాబాద్ జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రచారకర్తగా ఉన్నారు.
సరికొత్త ఆవిష్కరణలతో తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ యజమానులు హైదరాబాద్ హైద్రాస్ జట్టును తీసుకొచ్చారు. ముఖ్యంగా యువతను ద్రుష్టిలో పెట్టుకుంటూ ఆన్లైన్ గేమింగ్కు ఆదరణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా తొలి సీజన్ కోసం ఆహ్వానిస్తే కనివినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో ఈఎస్పీఎల్లో ఆడేందుకు ముందుకొచ్చారు. అయితే పరిశీలన తర్వాత మొత్తం 96 జట్లు పోటీపడుతాయి. ఇందులో నుంచి ఫైనల్గా ఎనిమిది జట్లు తుది దశకు అర్హత సాధించి హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎనిమిది జట్ల సమాహారంతో జరిగే ఈఎస్పీఎల్ తొలి సీజన్ దాదాపు రెండున్నర నెలల పాటు వర్చువల్ విధానంలో జరుగనుంది. ఇందులో మొత్తం ప్రైజ్మనీ రూ.25 లక్షలు కాగా, విజేతకు రూ.12 లక్షలు దక్కనున్నాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లకు వరుసగా రూ.6 లక్షలు, రూ.3 లక్షల నగదు ప్రోత్సాహం లభించనుంది. ఈఎస్పీఎల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు, గేమర్స్ www.indiatodaygaming.com/espl లో రిజిస్టర్ కావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈఎస్పీఎల్లో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. కరోనా వైరస్ ద్రుష్ట్యా వర్చువల్ రీతిలో జరిగే మ్యాచ్లన్నీ డిస్నీ హాట్స్టార్తో పాటు ఇండియా టుడేకు చెందిన అధికారిక యూట్యూబ్, ఫేస్బుక్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.