గత పోరులో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ కెంటా మొమోటాను చిత్తు చేసిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. అదే జోష్లో కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత, మనదేశానికే చెందిన లక్ష్యసేన్ను మట్టికరిపించి ప్రపంచ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. పీవీ సింధు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరం కాగా.. సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే పోరాటం ముగించింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, ధ్రువ్-అర్జున్ జోడీలు క్వార్టర్స్లో అడుగుపెట్టాయి.
టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్, ధ్రువ్-అర్జున్ జోడీలు కూడా క్వార్టర్స్కు అర్హత సాధించగా.. మహిళల ప్రిక్వార్టర్స్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 17-21, 21-16, 21-17తో మన దేశానికే చెందిన లక్ష్యసేన్పై విజయం సాధించాడు.
గంటా 15 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ఇరువురు షట్లరు కొదమసింహాల్లా పోరాడారు. తొలి గేమ్ చేజిక్కించుకున్న లక్ష్యసేన్.. ఒక దశలో మ్యాచ్ను కైవసం చేసుకునేలా కనిపించినా.. రెండో గేమ్లో అనూహ్యంగా పుంజుకున్న ప్రణయ్ దీటైన జవాబిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు, క్రాస్ కోర్ట్ షాట్లతో సాగిన పోరులో రెండో గేమ్ ప్రణయ్ గెలుచుకోవడంతో పోరు నిర్ణయాత్మక మూడో గేమ్కు చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి గేమ్లో లక్ష్యపై ప్రణయ్ పైచేయి సాధించాడు. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్లో జున్ పెంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సైనా నెహ్వాల్ 17-21, 21-16, 13-21తో బుసానన్ చేతిలో ఓటమి పాలైంది.
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించి మంచి ఊపు మీదున్న పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంచనాలను అందుకుంటూ క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం 21-12, 21-10తో జెప్పా బే-లస్సె మల్హెడె (డెన్మార్క్) జోడీపై గెలుపొందింది. అరగంటలో ముగిసిన పోరులో ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో మన వాళ్లు వరుస గేమ్ల్లో విజృంభించి మ్యాచ్ను ముగించారు.
మరో పోరులో అన్సీడెడ్గా బరిలోకి దిగిన ధ్రువ్ కపిల-అర్జున్ జంట అద్వితీయ ప్రదర్శన కనబర్చి క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్స్లో ధ్రువ్-అర్జున్ జోడీ 18-21, 21-15, 21-16తో టెర్రీ హీ-లోహ్ కీన్ (సింగపూర్) ద్వయంపై నెగ్గింది. గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన ధ్రువ్-అర్జున్.. ఆ తర్వాత సత్తాచాటారు.