Amit Mishra : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 వేలం మరో ఐదు రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే వేలంలో ఉన్న 405 మంది ఆటగాళ్ల తుది జాబాతాను ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. ఈ వేలంలో పాల్గొంటున్న భారత మాజీ లెగ్ అమిత్ మిశ్రా తాజాగా స్పందించాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఏదో ఒక ఫ్రాంఛైజీ తనను తీసుకుంటుందనే నమ్మకంతో మిశ్రా ఉన్నాడు. నాలో ఇంకా రెండు మూడేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటున్నా. పోయిన ఏడాది, ఈ సంవత్సరం దేశవాళీ క్రికెట్లో నా ప్రదర్శన మరీ అంత చెత్తగా ఏం లేదు. అందుకని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ నన్ను తీసుకుంటుందనే నమ్మకం నాకుంది అని మిశ్రా వెల్లడించాడు.
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న పెద్ద వయస్కుడిగా అమిత్ మిశ్రా గుర్తింపు సాధించాడు. ఈ టీ20 లీగ్లో అత్యధికంగా 166 వికెట్లు తీసిన భారత బౌలర్ తనే. అయితే పోయిన ఏడాది వేలంలో అతనికి చుక్కెదురైంది. ఏ ఫ్రాంఛైజీ కూడా ఈ స్పిన్నర్ను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. అయినా కూడా మిశ్రా నిరాశ చెందలేదు. ఈ సీజన్ వేలంలో కనీస ధర రూ.50 లక్షలకు పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. మళ్లీ ఐపీఎల్ సీజన్లో ఆడాలనే అమిత్ మిశ్రా కల నెరవేరనుందా! అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
గతంలో దక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరఫున మిశ్రా ఆడాడు. మూడుసార్లు (2008, 2011 2012 సీజన్లో) హ్యాట్రిక్ తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ప్రారంభం అవుతుంది.