బెంగళూరు: భవిష్యత్లో జరిగే మేజర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని 33 మంది ప్లేయర్లతో హాకీ ఇండియా (హెచ్ఐ) కోర్ గ్రూపును ఎంపిక చేసింది. గత కొన్ని నెలలుగా దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటుతున్న కుర్రాళ్లకు అవకాశం కల్పించింది. మొత్తం 60 మంది ప్లేయర్ల నుంచి ఎంపికైన 33 మందికి మూడు వారాల పాటు సాయ్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. వచ్చే నెలలో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్తో పాటు పలు టోర్నీలను లక్ష్యంగా పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నారు. కోర్ గ్రూపులో సీనియర్లు శ్రీజేష్, కెప్టెన్ మన్ప్రీత్సింగ్, హర్మన్ప్రీత్సింగ్, సురేందర్ కుమార్, మణ్దీప్సింగ్, లలిత్కుమార్తో పాటు యువ ప్లేయర్లు మన్దీప్ మోర్, జుగ్రాజ్సింగ్, అభిషేక్, సుఖ్జీత్సింగ్, సంజయ్, రబిచంద్రసింగ్ ఉన్నారు. ఈ 33 మంది నుంచి అత్యుత్తమ ప్లేయర్లను తుది జట్టుకు ఎంపిక చేస్తామని చీఫ్ కోచ్ గ్రహం రీడ్ పేర్కొన్నాడు. మూడు వారాల క్యాంప్ ద్వారా ఒక్కో ఆటగాన్ని పూర్తిగా పరిశీలించి..ఎంపికలో అవకాశం కల్పిస్తామన్నాడు. మొత్తంగా జాతీయ జట్టులో యువ రక్తాన్ని నింపేందుకు హాకీ ఇండియా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది.