GG vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో యూపీ వారియర్స్(UP Warriorz) వరుసగా రెండో మరో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. గ్రేస్ హ్యారిస్(72), తహ్లియా మెక్గ్రాత్(57) హాఫ్ సెంచరీతో యూపీని ఆదుకున్నారు. వీళ్లు ఔటయ్యాక సోఫీ ఎకిల్స్టోన్(19) మ్యాచ్ ముగించే బాధ్యత తీసుకుంది. గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై సిక్స్ కొట్టి గెలిపించిన ఆమె ఈసారి బౌండరీతో మ్యాచ్ను ముగించింది. దాంతో, యూపీ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టనుంది.
ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ మరోసారి విజేతగా నిలిచింది. ఒత్తిడిలోనూ ఆ జట్టు ప్లేయర్లు గ్రేస్ హ్యారిస్ (72) తహ్లియా మెక్గ్రాత్ (57) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. సూపర్ ఫామ్లో ఉన్న మెక్గ్రాత్ 34 బంతుల్లోనే 10 ఫోర్లతో ఫిఫ్టీ బాదింది. దాంతో, లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఈజోడీ నాలుగో వికెట్కు 78 పరుగులు చేసింది. ప్రమాదకరమైన తహ్లియా మెక్గ్రాత్(57)ను ఔట్ చేసి గార్డ్నర్ గుజరాత్కు బ్రేక్ ఇచ్చింది. 117 వద్ద యూపీ నాలుగో వికెట్ కోల్పోయింది. హ్యారిస్, సోఫీ ఎకిల్స్టోన్ ఆరో వికెట్కు 42 రన్స్ జోడించారు. హ్యారిస్ ఔటయ్యాక ఎకిల్స్టోన్ టెయిలెండర్లతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ రెండు వికెట్లు తీసింది. మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ్ రానా, గార్డ్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనలో యూపీ జట్టు స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అలీసా హీలీ (8), కిరణ్ నవగిరే (4), అలిసా హీలీ (12) వరుస ఓవర్లలో ఔటయ్యారు. 39 రన్స్ వద్ద యూపీ మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దేవికా వైద్య (7) స్టంపౌట్ అయ్యింది. దేవిక, మెక్గ్రాత్ మూడో వికెట్కు 20 రన్స్ జోడించారు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన యూపీ వారియర్స్ను మెక్గ్రాత్, హ్యారిస్ ఆదుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్కు ఓపెనర్లు లారా వొల్వార్డ్ (17,) సోఫీయా డంక్లెన్(23) శుభారంభం ఇచ్చారు. 41 రన్స్ వద్ద ఓపెనర్ వొల్వార్డ్ను అంజలీ సర్వానీ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (4) విఫలమైంది. గత ఐదు మ్యాచుల్లో పరుగులు చేయని దయలాన్ హేమలత (57) కీలక మ్యాచ్లో రాణించింది. డబ్ల్యూపీఎల్లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. ధాటిగా ఆడిన ఆమె 32 బంతుల్లోనే యాభై రన్స్ చేసింది. అష్ గార్డ్నర్(60)తో కలిసి నాలుగో వికెట్కు 93 పరుగులు జోడించింది. హేమలతను పర్షవి చోప్రా ఔట్ చేసింది. అప్పటికి గుజరాత్ స్కోర్.. 143. ఆ తర్వాత గార్డ్నర్ గేరు మార్చింది. దీప్తి శర్మ ఓవర్లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. చివర్లో సుష్మా వర్మ (8), అశ్వనీ కుమారి (5) పర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో పర్షవీ చోప్రా, రాజేశ్వరీ గైక్వాడ్ రెండేసి వికెట్లు తీశారు. సోఫీ ఎకిల్స్టోన్, అంజలీ సర్వానీకి ఒక్కో వికెట్ దక్కింది.