దుబాయ్ : ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో భారత మాజీ ఆటగాళ్లు వీరేందర్ సెహ్వాగ్, డయానా ఎడుల్జీలకు చోటు దక్కింది. ఈ గౌరవం దక్కిన తొలి భారత మహిళా క్రికెటర్ ఎడుల్జీ. వీరితోపాటు శ్రీలకం దిగ్గజం అరవింద డిసిల్వ కూడా ఈ గౌరవం అందుకున్నాడు. సోమవారం ఐసీసీ ఈ ముగ్గురికీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ గౌరవంపట్ల ఎడుల్జీ స్పందిస్తూ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి కావడం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపింది. 67 ఏళ్ల ఎడుల్జీ ప్లేయర్గా, అనంతరం పాలనా దక్షత కలిగిన వ్యక్తిగా రాణించింది. మూడు దశాబ్దాల కెరీర్లో ఎడుల్జీ 54 మ్యాచ్లలో (20 టెస్టులలో 404 పరుగులు, 63 వికెట్లు; 34 వన్డేలలో 211 పరుగులు, 46 వికెట్లు) తనదైన ముద్ర వేసింది. ధాటైన బ్యాట్స్మన్గా పేరుగాంచిన సెహ్వాగ్ 1999-2013 మధ్య కాలంలో 104 టెస్టులలో 8,586 పరుగులు, 251 వన్డేలలో 8,273 పరుగులు, 19 టి20 మ్యాచ్లలో 394 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.