టెస్టు క్రికెట్లో భారత అత్యుత్తమ సారధి విరాట్ కోహ్లీ.. రెడ్ బాల్ క్రికెట్లో కూడా తన సారధ్యానికి వీడ్కోలు పలికాడు. గతేడాది నవంబరులో అతను టీ20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్గా అతన్ని బీసీసీఐ తొలగించింది. ఇప్పుడు తాజాగా టెస్టు కెప్టెన్గా కూడా తాను తప్పుకుంటున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.
ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు కోహ్లీ నిర్ణయంపై స్పందించారు. ‘‘విరాట్, నువ్వు తలెత్తుకొని వెళ్లొచ్చు. ఒక కెప్టెన్గా నువ్వు సాధించినంత సాధించిన వాళ్లు చాలా తక్కువ. కచ్చితంగా భారత్లో అత్యంత ఎగ్రెసివ్, సక్సెస్ఫుల్ కెప్టెన్. ఈ జట్టును మనం కలిసి నిర్మించాం. ఇది వ్యక్తిగతంగా నాకు బాధాకరమైన రోజు’’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
భారత మాజీ ఆటగాడు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వసీం జాఫర్ కూడా కోహ్లీ నిర్ణయంపై రియాక్ట్ అయ్యాడు. ‘‘టెస్టు కెప్టెన్గా విరాట్ పగ్గాలు అందుకున్నప్పుడు భారత జట్టు విదేశాల్లో ఒక టెస్టు గెలిస్తే అదో మైలురాయి. అదే ఇప్పుడు విదేశాల్లో భారత్ ఓడిపోతే ఆశ్చర్యం. అతను భారత క్రికెట్ను అంతదూరం తీసుకొచ్చాడు. అదే అతని చరిత్ర. విజయవంతమైన శకానికి ధన్యవాదాలు కోహ్లీ’’ అని చెప్పాడు.
వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ‘‘భారత టెస్టు కెప్టెన్గా అత్యంత గొప్ప కెరీర్ పూర్తిచేసుకున్న కోహ్లీకి కంగ్రాచ్యులేషన్స్. గణాంకాలు అబద్ధాలు చెప్పవు. అతను కేవలం అత్యుత్తమ భారత టెస్టు కెప్టెన్ కాదు, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. గర్వంగా ఫీలవ్వు కోహ్లీ. నువ్వు బ్యాటుతో డామినేట్ చేయడాన్ని చూడాలని ఆశపడుతున్నా’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇలా చాలామంది మాజీ క్రికెటర్లు కోహ్లీ నిర్ణయంపై రియాక్టయ్యారు.