ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా క్రికటెర్ల బాగోగులు చూసుకునే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (FICA)కు ఆమె అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా లీసా చరిత్ర సృష్టించింది. లీసా నియామకాన్ని ఫికా మంగళవారం ఖరారు చేసింది.
స్విట్జర్లాండ్ లోని నియాన్ లో జరిగిన ఫికా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో లీసాను అధ్యక్షురాలిగా నియమించారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు విక్రమ్ సోలంకి స్థానాన్ని లీసా భర్తీ చేయనుంది. ఫికాకు గతంలో బ్యారీ రిచర్డ్స్ (సౌతాఫ్రికా), జిమ్మీ ఆడమ్స్ (వెస్టిండీస్) లు అధ్యక్షులుగా పనిచేశారు.
లీసా నియామకంపై ఫికా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హీత్ మిల్స్ స్పందిస్తూ.. ‘మా సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె మా సంస్థలకు తొలి మహిళా అధ్యక్షురాలు. ఈ పదవికి ఆమె అర్హురాలు. గతంలో లీసా క్రికెటర్, వ్యాఖ్యాత, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) లో సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఫికాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. ’అని తెలిపారు. ఇక తనను ఫికాకు అధ్యక్షురాలిగా నియమించడంపై లీసా హర్షం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవంగా అభివర్ణించింది.
ఆస్ట్రేలియా తరఫున 8 టెస్టులు, 125 వన్డేలు, 54 టీ20లు ఆడిన లీసా.. 2005, 2013 మహిళల వన్డే ప్రపంచకప్ తో పాటు 2010 లో మహిళల టీ20 ప్రపంచకప్ లలో గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలు. ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆమె వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది.