కరోనా వైరస్ విజృంభణ తర్వాత జరుగుతున్న జాతీయ స్థాయి హ్యాండ్బాల్ టోర్నీని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సాట్స్ సంపూర్ణ సహకారంతో హైదరాబాద్ వేదికగా టోర్నీని నిర్వహిస్తున్నాం. దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 24 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వేదికలుగా జరిగే టోర్నీ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 24 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించాం. పోటీల మొదటి రోజు 12 మ్యాచ్లు జరుగుతాయి. తొలిసారి టోర్నీని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. దీని ద్వారా ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయి అనుభూతి పొందుతారు.
టోర్నీలో పాల్గొనే వివిధ రాష్ర్టాల ప్లేయర్లు, కోచ్లు, రిఫరీలు , అధికారుల కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. టోర్నీని ఘనంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ చారిత్రక వైభవాన్ని తెలియజేసేందుకు పర్యాటక ప్రాంతాల పర్యటనకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దీని ద్వారా రాష్ట్ర ఘన చరిత్రను అందరికీ తెలియజేస్తాం. మ్యాచ్లను యూట్యూబ్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. ఒకే సమయంలో మూడు మ్యాచ్లు ప్రసారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
మెరికల్లాంటి ప్లేయర్లను ప్రోత్సహించడంలో మేము ఎప్పుడూ ముందుంటాం. ప్రస్తుత ఈ సబ్జూనియర్ టోర్నీ ద్వారా అండర్-15 విభాగంలో అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లను గుర్తిస్తాం. దేశ వ్యాప్తంగా 12 హ్యాండ్బాల్ అకాడమీలు ఉన్నాయి. టోర్నీలో ప్రతిభ చాటిన వారిని గుర్తించి వారిని అనుభవజ్ఞులైన కోచ్ల సహకారంతో మరింతగా తీర్చిదిద్దుతాం. ఇలా రానున్న కొన్నేండ్లలో అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేలా అత్యుత్తమ శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వరంగల్ కేంద్రంగా హ్యాండ్బాల్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరాం. త్వరలోనే దీనికి అనుమతి లభించే అవకాశముంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ఇలాంటి అకాడమీలు దోహదపడుతాయి.
ప్రస్తుత తెలంగాణ బాలుర సబ్జూనియర్ జట్టులో వరంగల్ నుంచి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. జట్టులో ఇక్కణ్నుంచి ప్లేయర్లు ఉన్నారు. వరంగల్ తర్వాత సిద్దిపేట, హైదరాబాద్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఔట్డోర్లో టోర్నీలో ఆడిన ప్లేయర్లు తొలిసారి ఇండోర్లోప్రత్యేక కోర్ట్పై ఆడనుండటం కొత్త అనుభూతి. టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నది.