Shahid Afridi : రావల్పిండిలో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు నలుగురు, పాక్ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు శతకాలు సాధించారు. బౌలర్లకు ఏమాత్రం అనుకూలంగా లేని ఈ పిచ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా కూడా పిచ్ తీరును తప్పుబట్టాడు. పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రీది రావల్పిండి పిచ్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ఇలాంటి పిచ్మీద యువ బౌలర్ నసీం షా కూడా అవలీలగా 70-80 పరుగులు చేయగలడు. ఒకదశలో నాకు మ్యాచ్ చూస్తున్నట్టు అనిపించలేదు. మ్యాచ్ చాలా బోర్ కొట్టింది. బౌలర్లకు వికెట్ తీసే అవకాశం దొరకలేదు. ఈ పిచ్మీద పాక్ను ఇంగ్లండ్ రెండు సార్లు అలౌట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు’ అని ఆఫ్రీది తెలిపాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 657 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్, బ్రూక్ శతకాలతో చెలరేగారు. పాక్ ఓపెనర్లతో పాటు కెప్టెన్ బాబార్ ఆజాం సెంచరీలు చేశారు. దాంతో ఆ జట్టు మూడో రోజు 7 వికెట్లు కోల్పోయి 499 పరుగులు చేసింది. పాక్ జట్టు ఇంకా 158 పరుగులు వెనకబడి ఉంది. నాలుగో రోజు ఇంగ్లండ్ చివరి 3 వికెట్లు తీసి, ఫాలో ఆన్ ఆడించే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే.. బౌలర్లకు సహకరించని పిచ్ మీద పాక్ను రెండు సార్లు అలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు అంత ఈజీ కాదని షాహిద్ ఆఫ్రీది అభిప్రాయపడ్డాడు.