DC vs RCB : కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore) బ్యాటర్లు చెలరేగారు. దాంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. ఎలీసా పెర్రీ (67) హఫ్ సెంచరీతో ఆర్సీబీని ఆదుకుంది. ఆమెకు రీచా ఘోష్ (37) సహకారం అందించింది. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్స్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాలుగో వికెట్కు 74 రన్స్ జోడించారు. ఎలీసా, రీచా 14వ ఓవర్ నుంచి ఎడాపెడా బౌండరీలు బాదారు.
దాంతో, ఆర్సీబీ 160 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, 137 పరుగుల వద్ద రీచా నాలుగో వికెట్గా వెనుదిరిగింది. దాంతో, స్కోర్బోర్డు వేగం మందగించింది. పెర్రీ, రీచా ధాటికి ఆఖరి ఆరు ఓవర్లలో 82 పరుగులు వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు, తారా నోరిస్ ఒక వికెట్ తీశారు.
గత మ్యాచ్లో విఫలమైన ఆర్సీబీ కెప్టెన్ మంధాన (8) కీలక మ్యాచ్లో విఫలం అయింది. 24 పరుగుల వద్ద ఆమె తొలి వికెట్గా వెనుదిరిగి ఫ్యాన్స్ను నిరాశ పరిచింది. ఆమె ఔటయ్యాక ఓపెనర్ సోఫీ డెవిన్ (21), ఎలీసా పెర్రీ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. అయితే శిఖాపాండే సోఫీని బౌల్డ్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన హీథర్ నైట్ (11) కూడా తక్కువ రన్స్కే పెవిలియన్ చేరింది. దాంతో, 63 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీని పెర్రీ, రీచా ఘోష్ ఆదుకున్నారు. తారా నోరిస్ ఓవర్లో పెర్రీ ఒకటి, రీచా రెండు సిక్స్లు కొట్టారు. దాంతో, ఆర్సీబీ స్కోర్ వంద దాటింది. ఈ క్రమంలోనే 45 బంతుల్లో పెర్రీ హాఫ్ సెంచరీ సాధించింది. రీచాతో కలిసి ఢిల్లీ బౌలర్లపై సిక్స్లతో విరుచుకుపడింది.