పారిస్: స్టార్ షూటర్ మనూ భాకర్(Manu Bhaker).. పారిస్ ఒలింపిక్స్ ముగింపు సంబరాల్లో.. భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మానూ భాకర్ .. తాజా గేమ్స్లో రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. వ్యక్తిగత 10మీటర్ల ఎయిర్ పిస్తోల్, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలుచుకున్నది. మనూ భాకర్ను ఫ్లాగ్ బేరర్గా ఎంపిక చేశామని, క్రీడల్లో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిందని, పతాకధారిణిగా ఆమె అర్హురాలు అని ఒలింపిక్ సంఘం అధికారి ఒకరు తెలిపారు.
భారత పతాకధారిణిగా ఉండడం గర్వంగా ఫీలవుతున్నట్లు షూటర్ మనూ తెలిపింది. తమ బృందంలో జెండాను ఆవిష్కరించే అర్హులు ఎంతో మంది ఉన్నారని, కానీ నన్ను కోరడాన్ని గొప్ప మర్యాదగా భావిస్తానని ఆమె అన్నారు. అయితే క్లోజింగ్ సెర్మనీలో జెండాను పట్టుకునే మగ అథ్లెట్ ఎవరన్నది ఇంకా అధికారులు ప్రకటించలేదు. మనూ భాకర్తో పాటు ఈ క్రీడల్లో షూటర్ స్వప్నిల్కు కాంస్య పతకం దక్కింది.
ఇవాళ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్.. బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడనున్నాడు. మహిళల 68 కేజీల విభాగంలో రెజ్లర్ నిషా దహియా తన క్యాంపేన్ ఇవాళ స్టార్ట్ చేయనున్నది. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా .. ఆగస్టు ఆరో తేదీ నుంచి తన క్యాంపేన్ ప్రారంభిస్తారు.