బిష్కెక్(కిర్గిస్థాన్): అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల 68కిలోల విభాగంలో రాధిక రజత పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో రాధిక..జపాన్ రెజ్లర్ నోనొక వొజాకి చేతిలో ఓటమిపాలైంది.
టెక్నికల్ సుపీరియారిటీలో నోనొక ఆధిక్యం కనబరిచింది. మరోవైపు 50కిలోల కాంస్య పతక పోరులో శివానీ 9-7తో ఒట్గోజార్గల్ దోల్గోజ్రావ్(మంగోలియా)పై గెలిచింది. వేర్వేరు కాంస్య పతక బౌట్లలో తమన్నా(55కి), పుష్పా యాదవ్(59కి) ప్రత్యర్థుల చేతిలో ఓడి కాంస్య పతకాలను చేజార్చుకున్నారు.