న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పడింది. పట్టుకుంటే బంగారం అన్న రీతిలో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం కార్పొరేట్ కంపెనీలు కడదాకా పోటీపడ్డాయి. మూడు రోజుల పాటు సాగిన ఆన్లైన్ వేలంలో రికార్డు స్థాయిలో బోర్డుకు రూ.48, 390 కోట్ల ఆదాయం సమకూరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ల్లో ఐపీఎల్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. వచ్చే ఐదేండ్ల(2023-27) కాలానికి బోర్డు ఆహ్వానించిన వేలంలో డిస్నీ స్టార్, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 సంస్థలు హక్కుల కోసం కోట్లు గుమ్మరించాయి. ప్యాకేజీ-ఏలో భాగంగా ఉపఖండంలో టెలివిజన్ ప్రసార హక్కులను డిస్నీ స్టార్ రూ.23, 575 కోట్లకు దక్కించుకుంది. ఐదేండ్లలో ఒక్కో మ్యాచ్ కోసం రూ.57.5 కోట్లు పలికింది. అత్యంత ఆసక్తి రేపిన డిజిటల్ హక్కుల కోసం వయాకామ్18 రూ.20,500 కోట్లు ఖర్చు చేసింది. ఉపఖండం లోపల డిజిటల్ మీడియా ప్రసారాలను సొంతం చేసుకునేందుకు మిగతా సంస్థల కంటే వయాకామ్ అధిక ఆసక్తి కనబరిచింది.
ప్యాకేజీ-సీ(నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ రైట్స్) హక్కులను కూడా వయాకామ్ రూ.2991 కోట్లకు తమ వశం చేసుకుంది. ప్యాకేజీ-డీ(ఉపఖండం అవతల టీవీ, డిజిటల్ మీడియా)రైట్స్ను వయాకామ్, టైమ్స్ ఇంటర్నెట్ సంయుక్తంగా రూ.1324 కోట్లకు కైవసం చేసుకుంది. ఈ రెండు సంస్థలు ఒక్కో మ్యాచ్కు రూ.3 కోట్లు చెల్లించనున్నాయి. ప్రస్తుత హక్కుల ద్వారా ఎన్ఎఫ్ఎల్(17 మిలియన్ డాలర్లు) తర్వాత అత్యంత ఖరీదైన లీగ్గా ఐపీఎల్(14.61 మిలియన్ డాలర్లు) నిలిచింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ ‘ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ స్థాయిలో ధర పలకడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ సత్తా ఏంటో ఈ బిడ్డింగ్ ద్వారా తెలిసింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేండ్లు ఒడిదొడుకులు ఎదుర్కొన్నా..అద్భుతంగా పుంజుకున్నాం. ముఖ్యంగా డిజిటల్ రైట్స్కు అనూహ్య ధర పలికింది. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత ఖరీదైన లీగ్గా నిలిచింది’ అని అన్నారు.