టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో అతను ఆడే అవకాశంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
భారత జట్టులో ధోనీ పాత్ర పోషించే వాళ్లు కరువయ్యారని, ఫినిషర్ కోసం జట్టు ఎదురు చూస్తోందని అన్నాడు. ధోనీ తర్వాత ఆ పాత్ర పోషించే ఆటగాడు లేక భారత జట్టు చాలా ఇబ్బందులు పడుతోందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. జట్టులో కీపింగ్ చేస్తూ టాపార్డర్లో ఆడే బ్యాటర్ కావాలా? లేదంటే ఫినిషర్ కావాలా? అనే అంశంపై కార్తీక్ ఎంపిక ఆధారపడి ఉంటుందన్న శాస్త్రి..
సౌతాఫ్రికా సిరీస్లో అతను కనుక సత్తా చాటితే కచ్చితంగా ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు. కార్తీక్ కనుక ధోనీ పాత్ర పోషించగలిగితే.. కచ్చితంగా భారత జట్టుకు ఎంపికవుతాడని పేర్కొన్నాడు.