టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య నడుస్తున్న కెప్టెన్సీ వివాదంపై భారత్ మాజీ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బిసిసిఐ అధ్యక్షుడి పదవిలో ఉన్న గంగూలీ.. సెలెక్షన్ కమిటీ తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు అది గంగూలీ చేయాల్సిన పనికాదు.. ఆయన బిసిసిఐకే అధ్యక్షుడు. భారత్ క్రికెట్ జట్టులో సెలెక్షన్ లేదా కెప్టెన్సీ గురించి నిర్ణయం తీసుకోవాలన్నా లేదా అధికారికంగా మాట్లాడాలన్నా అది సెలెక్షన్ కమిటీ చైర్మెన్ చేస్తారు” అని అన్నారు.
ఇటీవల టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ టీ20 జట్టు సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. భారత క్రికెట్ బోర్డు అతడిని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించి.. కేవలం టెస్టు జట్టు కెప్టెన్సీకే పరిమితం చేసింది. అతని స్థానంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను వన్డే, టి20 జట్టుకు కెప్టెన్గా నియమించింది. ఈ విషయం గురించి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. కెప్టెన్సీ మార్పు గురించి కోహ్లీతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. కానీ సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్కు టీమిండియా బయలుదేరే ముందు జరిగిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తనతో బోర్డు సెలెక్షన్ కమిటీ చర్చించలేదని.. కేవలం ప్రకటన చేసే గంట మందు తనకు కబురు చేశారని చెప్పాడు. దీంతో గంగూలీకి వ్యతిరేకంగా సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇంతకుమందు ఈ కెప్టెన్సీ వివాదంలో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కోహ్లీ పక్షంలో నోరువిప్పారు. ఇప్పుడు దిలీప్ వెంగసర్కార్ లాంటి దిగ్గజ క్రికెటర్ కూడా గంగూలీని తప్పుపట్టారు. విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ని అలా తొలగించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. కోహ్లీ దేశం కోసం మంచి ఇన్నింగ్స్ ఆడాడని.. అలాంటి క్రికెటర్కి కెప్టెన్ పదవి నుంచి సాగనంపేముందు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. అయినా భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లను సరైన కారణం లేకుండా తొలగించడం బోర్డుకు అలవాటుగా మారిందని.. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని వెంగసర్కార్ అన్నారు.