‘ధ్రువ్ జురెల్ దీక్ష చూస్తుంటే.. మరో మహేంద్రసింగ్ ధోనీ తయారవుతున్నాడని అనిపిస్తున్నది. ఒక్క సెంచరీ చేజారినా.. భవిష్యత్తులో అతడు ఇదే ఏకాగ్రతతో ఆడితే చాలా శతకాలు చేస్తాడు’
– సునీల్ గవాస్కర్
‘ఇంగ్లండ్పై నాలుగో టెస్టు విజయం ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం బాగుంది. జట్టు సమిష్టిగా సత్తాచాటినా.. అందులో ధ్రువ్ జురెల్ శ్రమ ప్రత్యేకంగా ప్రస్ఫుటించింది. శాంతంగా పని ముగించే తీరు ఆకట్టుకుంది’
– సచిన్ టెండూల్కర్
ఈ రెండు ఉదాహరణలు చాలు.. ధ్రువ్ జురెల్ భారత అభిమానులపై ఎంతటి ప్రభావం చూపాడో చెప్పడానికి! జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ముందు నిలువడం.. ‘ఇప్పుడు కాకుంటే.. ఇంకెప్పుడూ? నువ్వు కాకపోతే.. ఇంకెవరూ?’ అనే రాహుల్ ద్రవిడ్ సూక్తిని తూచా తప్పకుండా పాటించడం అతడికే చెల్లింది. రాంచీ టెస్టులో భారత్ పరాజయం ఖాయం అనుకున్న సమయంలో ఆణిముత్యం లాంటి
ఇన్నింగ్స్ ఆడిన.. ఈ ఉత్తర ప్రదేశ్ బ్యాటర్పై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : సంధి దశలో ఉన్న భారత టెస్టు జట్టుకు మరో ఆణిముత్యం లభించినట్లే కనిపిస్తున్నది. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి వంటి టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు.. భారత జట్టు దరిదాపుల్లో లేకుండా పోగా.. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో సిరీస్కు దూరమయ్యాడు. మిడిలార్డర్ బాధ్యత మోయాల్సిన కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరం కాగా.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆడుతున్న రెండో టెస్టులోనే ఓ ప్లేయర్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. పట్టుమని పది లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా లేని ఆ కుర్రాడు.. ఇంగ్లిష్ బ్యాటర్ల బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17 మ్యాచ్లే ఆడినా.. 50కి పైగా సగటుతో పరుగులు చేసిన అతడి ప్రతిభ.. అంతర్జాతీయ స్థాయిలోనూ పనికి వచ్చింది. మనమిప్పటి వరకు చెప్పుకుంది ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ చంద్ జురెల్ గురించే! వృధ్దిమాన్ సాహా, రిషబ్ పంత్ లేని లోటును పూడుస్తాడనుకున్న తెలుగు కీపర్ శ్రీకర్ భరత్ చేజేతులా చాన్స్లు చెడగొట్టుకోగా.. ఈగోకు వెళ్లిన ఇషాన్ కిషన్ అవకాశాలు చేజార్చుకున్నాడు. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ ధ్రువ్ దూసుకొచ్చాడు. రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ధ్రువ్ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తన ఇన్నింగ్స్లోనే తన బ్యాటింగ్ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటాడు. సహచరులు అండగా ఉన్నంతసేపు నింపాదిగా ఆడిన ధ్రువ్.. ఆ తర్వాత తనలోని విధ్వంసక ఆటగాడిని పరిచయం చేశాడు. కొలత వేసినట్లు కొట్టే బౌండ్రీలు.. హద్దులు చెరిపేసేలా బాదే సిక్సర్లు అతడి ప్రతిభను బయటపెట్టగా.. రాంచీ టెస్టుకు వచ్చేసరికి జురెల్లో ధాటిగా ఆడగల బ్యాటర్తో పాటు.. మంచి యాంకర్ కూడా ఉన్నాడని తెలిసిపోయింది.
నాలుగో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా.. ప్రతిగా.. మన టాపార్డర్ విఫలమవడంతో 177కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి దశలో ఇంగ్లండ్ బౌలర్లు జోరు పెంచగా.. కుల్దీప్ అండతో ధ్రువ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో భారత్ తిరిగి పోటీలోకి రాగలిగింది అంటే అది ధ్రువ్ పోరాటం వల్లే అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యఛేదనలో 120కి 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్.. చివరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించడంతో పాటు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కన్నా జట్టు విజయానికే అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్న జురెల్ ఇదే జోరు కొనసాగిస్తే.. భారత టెస్టు జట్టుకు మంచి వికెట్ కీపర్ బ్యాటర్ దొరికినట్లే!