ముంబై: దేశంలో క్రికెట్కు ఉన్న ఆధరణ ఏంటో అందరికీ తెలిసిందే. క్రికెటే ఊపిరిగా, మరో మతంగా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక క్రికెటర్ల ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమ అభిమాన ఆటగాడిని దైవంతో సమానంగా కొలుస్తుంటారు. తమ సమక్షంలో వారిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోరుకదా.. అలాంటిదే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో (Kolhapur) జరిగింది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ తలపడ్డాయి. ముంబై బౌలర్లపై హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదుచేసిన జట్టుగా సరికొత్త రికార్డును సృష్టించింది. 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజింగ్ చేయడానికి ముంబై బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) క్రీజులోకి వచ్చాడు. తన హార్డ్ హిట్టింగ్తో 12 బాల్స్లోనే 26 రన్స్ చేశాడు. అయితే జట్టు స్కోర్ వేగాన్ని పెంచడంలో భాగంగా హిట్మ్యాన్ ఔటయ్యాడు.
కాగా, కొల్హాపూర్లో మ్యాచ్ చూస్తున్న బండోపంత్ టిబిలే అనే వృద్ధుడు (63) రోహిత్ ఔటైపోయాడు. ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుందంటూ హేళన చేశాడు. ధోనీ ఫ్యాన్ అయిన అతడు.. తమ అభిమాన ఆటగాన్ని హేళన చేయడంతో.. రోహిత్ అభిమానులు బల్వంత్ మహదేవ్, సాగర్ సదాశివ్ ఝాంగ్జీ ఆగ్రహంతో ఊగిపోయారు. కోపంలో బండోపంత్ తలపై కర్రతో కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అంతడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైదులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులిద్దరిని అరెస్టుచేశారు.