జైపూర్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్తులు దక్కించుకున్న జట్లకు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు సన్రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇవ్వగా, తాజాగా పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్పై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు గుమ్మరించింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళుదామనుకున్న పంజాబ్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్పై అద్భుత విజయం సాధించింది.
పంజాబ్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. సమీర్ రిజ్వి(25 బంతుల్లో 58 నాటౌట్, 3ఫోర్లు, 5సిక్స్లు), కరణ్నాయర్(44), కేఎల్ రాహుల్(35) రాణించారు. బ్రార్(2/41)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత కెప్టెన్ శ్రేయాస్ అయ్య ర్(34 బంతుల్లో 53, 3ఫోర్లు, 2సిక్స్లు), స్టొయినిస్(16 బంతుల్లో 44 నాటౌట్, 3ఫో ర్లు, 4సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 206/8 స్కోరు చేసింది. రెహమన్(3/33) మూడు వికెట్లతో రాణించాడు. రిజ్వికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
లీగ్లో మంచి ఫామ్మీదున్న ప్రియాంశ్ ఆర్య(6) స్వల్ప స్కోరుకే వెనుదిరుగడంతో పంజాబ్కు సరైన శుభారంభం దక్కలేదు. ఫస్ట్డౌన్లో వచ్చిన ఇంగ్లిస్(32), ప్రభ్సిమ్రన్సింగ్(28) పంజాబ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వచ్చి రావడంతోనే ఇంగ్లిస్..ఢిల్లీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన విప్రాజ్ నిగమ్ స్పిన్ తంత్రంలో ఇంగ్లిస్ ఇరుక్కుపోయాడు. తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచిన ఇంగ్లిస్..నిగమ్ వేసిన గూగ్లీని సరిగ్గా అర్థం చేసుకోకుండా ముందుకు ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యాడు.
ఆ తర్వాత 20 పరుగుల తేడాతో ప్రభ్సిమ్రన్ కూడా నిగమ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మధ్యలో రెహమన్ ధాటికి శశాంక్(11), వదేరా(16) ఇలావచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో స్టోయినిస్ మెరుపులతో అదరగొట్టాడు. మోహిత్శర్మను లక్ష్యంగా చేసుకుంటూ ఒకే ఓవర్లో 22 పరుగులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే 3ఫోర్లు, 4 భారీ సిక్స్లతో 44 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
ఓపెనర్లు రాహుల్(35), కెప్టెన్ డుప్లెసిస్(23) తొలి వికెట్కు 55 పరుగులు జతచేశారు. వీరిద్దరు పంజాబ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అయితేయాన్సెన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్..శశాంక్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 10 పరుగుల తేడాతో డుప్లెసిస్ను బ్రార్ రెండో వికెట్గా పెవిలియన్ పంపాడు. కరణ్నాయర్, అటల్(22) ఇన్నింగ్స్ను గాడిలో పడేశారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశారు.
బ్రార్ బౌలింగ్లో నాయర్ క్లీన్బౌల్డ్ కాగా, దూబే బౌలింగ్లో అటల్ వెనుదిరిగాడు. గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ సమీర్ రిజ్వి, స్టబ్స్ సమీకరణాలను మార్చేశారు. స్టబ్స్ సహకారంతో రెచ్చిపోయిన రిజ్వి అజేయ అర్ధసెంచరీతో ఢిల్లీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. పంజాబ్కు షాక్ ఇచ్చిన ఢిల్లీ ఈ సీజన్ను కిక్కించే గెలుపుతో ముగించింది.