Ricky Ponting : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్కు దూరం కానున్న భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ను ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఒక కోరిక కోరాడు. డగౌట్లో తన పక్కనే కూర్చోవాలని పంత్ను రిక్వెస్ట్ చేశాడు. కారు యాక్సిడెంట్లో గాయపడి కోలుకుంటున్న పంత్ను పాంటింగ్ రెండు రోజుల క్రితం ఫోన్లో పలకరించాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. పంత్ కారు ప్రమాదంపై స్పందిస్తూ.. ‘అది చాలా భయానక సమయం. ప్రతి ఒక్కరిని ఎంతో భయపెట్టింది’ అని పాంటింగ్ అన్నాడు. అంతేకాదు.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని పంత్కు చెప్పానని పాంటింగ్ వెల్లడించాడు. ‘పంత్ ఇంకా కోలుకోలేదు. అతను మైదానంలోకి దిగే అవకాశం తక్కువే. మేమందరం అతడిని ఎంతగానో ప్రేమిస్తున్నాం. పంత్ వ్యక్తితం, చెరగని నవ్వు అంటే మా అందరికి చాలా ఇష్టం. కెప్టెన్గా జట్టును బాగా నడిపించగలడు. అందుకనే అతను డగౌట్లో నా పక్కన కూర్చోవాలి అనుకుంటున్నా. ఒకవేళ అందుకు పంత్ ఒప్పుకుంటే నేను అతని వెన్నంటే ఉంటా’ అని ఆ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ పాంటింగ్ వెల్లడించాడు.
కొత్త కెప్టెన్, కీపర్ వేటలో..
డిసెంబర్ 29న ఉదయం 5 గంటలకు రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దాంతో, అతని మోకాలు, వీపు, నుదురు మీద గాయాలయ్యాయి. అతడిని వెంటనే డెహ్రడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఈమధ్యే ముంబైలో పంత్కు సర్జరీ చేశారు. అతను కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో ఆసీస్తో టెస్ట్ సిరీస్కు బీసీసీఐ అతడిని సెలక్ట్ చేయలేదు. అంతేకాదు ఐపీఎల్లోనూ ఆడే అవకాశం లేదు. దాంతో, ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ప్లేస్ను భర్తీ చేయగల కెప్టెన్, వికెట్ కీపర్ కోసం చూస్తోంది. పంత్ ఈ ఏడాదంతా క్రికెట్కు దూరమయ్యే అవకాశం ఉంది.