చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్స (5) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు పని అయిపోయిందని అభిమానులు అనుకున్నారు.
అయితే మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్ (60) దొరికిన బంతిని దొరికినట్లే బాదేశాడు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది. అతనికి ధవన్ (33) అండగా నిలిచి మరో వికెట్ పడనీయలేదు. వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ (26) కూడా ప్రతి ఓవర్లోనూ ఒక సిక్సర్ ఉండేలా బ్యాటింగ్ చేయడంతో.. పంజాబ్ రన్రేట్ ఎక్కడా తగ్గకుండా సాగింది. 15వ ఓవర్లో ప్రిటోరియస్వ వేసిన బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఊతప్ప తలమీదుగా పంపేందుకు జితేష్ ప్రయత్నించాడు. కానీ ప్రిటోరియస్ డెలివరీలో దానికి అవసరమైన పేస్ లేదు.
దాంతో ఊతప్పకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే షారుఖ్ ఖాన్ (6)ను జోర్డాన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం 15.4 ఓవర్లకు పంజాబ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులతో నిలిచింది.