Pakistan Cricket Crisis: ఇటీవల కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు తాజాగా మరోసారి అదే బాటలో పయనిస్తోంది. గతేడాది శ్రీలంక వేదికగా ముగిసిన ఆసియా కప్ తర్వాత ఆ జట్టుకు స్టార్ట్ అయిన బ్యాడ్ టైమ్ నిరాటంకంగా కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్తో పాటు ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన పాక్.. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన రెండు టీ20లలో ఓడింది. ఆదివారం కివీస్తో రెండో మ్యాచ్లో ఓడిన తర్వాత పాక్ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయట. పాకిస్తాన్ మీడియాలో ఇప్పుడితే హాట్ టాపిక్.
న్యూజిలాండ్ పర్యటనలో పాక్కు ఇది వరుసగా రెండో ఓటమి. హమిల్టన్ వేదికగా ముగిసిన రెండో టీ20లో కివీస్ నిర్దేశించిన 195 పరుగుల ఛేదనలో పాక్ ఓ దశలో 96-2 తో గెలుపుదిశగా పయనించింది. కానీ ప్రపంచ క్రికెట్లో మరెవరికీ సాధ్యం కాని విధంగా ఎప్పుడు ఏ విధంగా ఆడి మ్యాచ్ను పోగొట్టుకుంటుందో (నిలకడలేమి) తెలియని పాకిస్తాన్ మరోసారి అదే బాటపట్టింది. బాగా ఆడుతున్న ఫకర్ జమాన్ (20), బాబర్ ఆజమ్ (66) ఔట్ కావడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ షహీన్ షా అఫ్రిది (22) మినహా మరే బ్యాటర్ కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిశాక టీమ్ మేనేజ్మెంట్.. టీమ్ మేట్స్ మధ్య డ్రెస్సింగ్ రూమ్లో వాగ్వాదం జరిగినట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. ఓటమికి మీరంటే మీరే బాధ్యత అని ఆటగాళ్లు ఒకరినొకరు నిందించుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆడిన చివరి 12 అంతర్జాతీయ మ్యాచ్లలో ఆ జట్టుకు ఇది పదో ఓటమి.
Pakistan in the last 12 matches in International cricket:
Won – 2
Lost – 10 pic.twitter.com/UzpTcwS1Wa
— Johns. (@CricCrazyJohns) January 14, 2024
పాక్ జట్టులో విభేదాలు, వివాదాలు ఇటీవల కాలంలో నిత్యకృత్యమయ్యాయి. ఆసియా కప్ ఓటమి తర్వాత వన్డే ప్రపంచకప్లో భారత్లో ఆడనని భంగపడటం, ప్రపంచకప్లో వరుస ఓటములతో డ్రెస్సింగ్ రూమ్లో తాజా, మాజీ సారథులు షహీన్ షా అఫ్రిది – బాబర్ ఆజమ్లు తగువులాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాబర్.. పీసీబీ చీఫ్ను కలుద్దామని ఫోన్ చేసినా అతడు అందుకు అంగీకరించలేదన్న చాట్ మీడియాకు లీక్ కావడం, ప్రపంచకప్ వైఫల్యంతో ఇంజమామ్ ఉల్ హక్తో పాటు ఇతర కోచ్ల తొలగింపు, కొత్త కోచింగ్ సిబ్బంది, బాబర్ కెప్టెన్సీకి ఉద్వాసన వంటివాటితో ఆ జట్టు నిత్యం సావాసం చేస్తూనే ఉంది. తాజాగా డ్రెస్సింగ్ రూమ్ ఇష్యూతో పాక్ మరోసారి వార్తల్లో నిలవడం గమనార్హం.