సిడ్నీ: ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup ) కోసం గురువారం 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. వెస్టిండీస్, బంగ్లాదేశ్ టూర్లకు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్లాంటి వాళ్లు తిరిగి టీమ్లోకి వచ్చారు. అయితే యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోష్ ఇంగ్లిస్ను టీమ్లోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రధాన వికెట్ కీపర్గా మాథ్యూ వేడ్ ఉండగా.. అనుభవం ఉన్న అలెక్స్ కేరీని కాదని బ్యాకప్గా ఇంగ్లిస్ను తీసుకున్నారు. గత సీజన్లో ఇంగ్లండ్లో జరిగిన వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో మంచి ఫామ్లో ఉన్న ఇంగ్లిస్.. టాప్ స్కోరర్గా నిలిచాడు. కొంత కాలంగా అతని ఆటతీరును తాము పరిశీలిస్తున్న సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ చెప్పాడు.
కేరీతోపాటు మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జోష్ ఫిలిప్, ఆష్టన్ టర్నర్లాంటి వాళ్లు టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. మార్కస్ స్టాయినిస్, కేన్ రిచర్డ్సన్లాంటి టీ20 స్పెషలిస్టులు మాత్రం మళ్లీ టీమ్లోకి వచ్చారు. రికార్డు స్థాయిలో ఐదు వన్డే వరల్డ్కప్లను గెలిచిన ఆస్ట్రేలియా.. ఇప్పటి వరకూ ఒక్క టీ20 వరల్డ్కప్ కూడా గెలవలేకపోయింది.
టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా టీమ్: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఆష్టన్ అగార్, ప్యాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హేజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా