చెన్నై: మెల్ట్వాటర్ చాంపియన్స్ చెస్ టూర్ చెసేబుల్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద వెనుకంజలో ఉన్నాడు. ప్రపంచ రెండో నంబర్ డింగ్ లిరెన్ (చైనా)తో హోరాహోరీగా తుది పోరు సాగుతున్నది. నాలుగు రౌండ్లు జరిగిన తొలి అర్ధభాగంలో చెన్నై చిన్నోడు 1.5-2.5తో లిరెన్తో కొంత వెనుకబడి ఉన్నాడు. తొలి రౌండ్లో చైనా చెస్ దిగ్గజం లిరెన్ ఆధిక్యం సాధించగా.. ఆ వెంటనే పుంజుకున్న మనోడు రెండో రౌండ్ను చేజిక్కించుకున్నాడు. స్కోర్లు సమం చేసి ప్రజ్ఞానంద ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు. అనంతరం మూడో రౌండ్లో మనోడు తడబడడంతో లిరెన్ పైచేయి సాధించాడు. ఆఖరి పోరులో ‘డ్రా’ కావడంతో ప్రజ్ఞానంద ఒక పాయింట్ వెనుకబడి ఉన్నాడు. రెండో దశలో భాగంగా మరో నాలుగు రౌండ్లు శుక్రవారం తెల్లవారుజామున పూర్తవుతాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ టోర్నీలో స్కోర్లు సమం అయితే ‘టై’ బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.