న్యూఢిల్లీ: ఐపీసీలోని 354, 354డీ, 354ఏ& 506 (1) సెక్షన్ల కింద బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బ్రిజ్ తమను లైంగికంగా వేధించినట్లు పలువురు మేటి మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై విచారణ చేపట్టారు. ఇవాళ వెయ్యి పేజీల చార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. మైనర్ను వేధించినట్లు చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసును రద్దు చేయాలని తమ చార్జిషీట్లో పోలీసులు కోరారు. ఇక మిగితా ఆరోపణల్లో మాత్రం ఆయనపై విచారణ కొనసాగనున్నది.
పోక్సో కేసు మినహాయిస్తే.. మిగితా వేధింపుల కేసుల్లో బ్రిజ్పై విచారణ కొనసాగుతోంది. బ్రిజ్పై 354, 354డీ, 354ఏ& 506 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన పీఆర్వో సుమన్ నాల్వా తెలిపారు. పోక్సో విషయంలో మాత్రం ఆ కేసును రద్దు చేయాలని రిపోర్టు ఫైల్ చేసినట్లు ఆమె తెలిపారు. 354, 354డీ, 354ఏ& 506 (1) సెక్షన్ల కింద చార్జిషీట్ను దాఖలు చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.
మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక లైంగిక వేధింపులు, వెంటపడడం లాంటి కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.