చెన్నై: చక్కటి ప్రదర్శనతో దుమ్మురేపుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. మరో రౌండ్ మిగిలుండగానే టాటా స్టీల్ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తద్వారా.. పి. హరికృష్ణ, అధిబన్, విదిత్ గుజరాతి తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన నాలుగో భారత చెస్ ప్లేయర్గా అర్జున్ రికార్డుల్లోకెక్కాడు. మరో రౌండ్ మిగిలుండగానే 18 ఏండ్ల అర్జున్ 9.5 పాయింట్లతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. శనివారం వియత్నాం ప్లేయర్ థాయ్ డాన్ వోన్తో జరిగిన పోరును ‘డ్రా’ చేసుకోవడం ద్వారా అర్జున్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాడు. మరో రౌండ్ మిగిలున్నా.. ఇతర ఆటగాళ్లకు అర్జున్ను దాటి ముందుకెళ్లే అవకాశాలు లేవు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరుగనున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్జున్ నేరుగా అర్హత సాధించాడు. ‘చాలా సంతోషంగా ఉంది. క్లాసికల్ టోర్నీల్లో నా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటి. గతంలో ర్యాపిడ్ విభాగంలో ఇక్కడ విజేతగా నిలిచా. ఆదివారం చివరి రౌండ్ ముగిశాక ఈ విజయాన్ని ఆస్వాదిస్తా’ అని మ్యాచ్ అనంతరం అర్జున్ పేర్కొన్నాడు.